ఇండోనేసియా హ్యాకర్ల టార్గెట్ గా 12 వేల భారత్ వెబ్‌సైట్లు

ఇండోనేషియాకు చెందిన ఓ సైబర్‌ నేరగాళ్ల ముఠా భారత్‌లోని ప్రభుత్వ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్రం ముందుగానే గుర్తించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 12 వేల వెబ్‌సైట్లను ఓ హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
 
 వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కూడా ఉన్నట్లు పేర్కొంది. కేంద్ర హౌంశాఖ ”ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేటర్‌ సెంటర్‌” ఈ దాడిని ముందుగానే పసిగట్టింది. హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సైట్ల దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.
 
”డినయల్‌ ఆఫ్‌ సర్వీస్‌”, ”డిస్ట్రిబ్యూటెడ్‌ డినయల్‌ ఆఫ్‌ సర్వీస్‌” దాడుల ద్వారా వెబ్‌సైట్లను హ్యకర్లు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. వేర్వేరు వ్యక్తిగత కంప్యూటర్ల ద్వారా ఒకే సారి పెద్ద ఎత్తున డేటాను సైట్లలోకి జప్పించి పెద్ద ఎత్తున సైబర్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
 
హ్యకర్లు టార్గెట్‌ చేసిన కొన్ని వెబ్‌సైట్లను గుర్తించి ముందుగానే సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకుంది. అపరిచిత మెయిల్స్‌, లింకులను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయవద్దని అధికారులను హౌంశాఖ హెచ్చరించింది. అన్ని సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేయాలని సూచించింది.
గతేడాది రాన్సమ్‌వేర్‌ దాడి కారణంగా ఆల్‌ ఇండియాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) వ్యవస్థను కుప్పకూల్చింది. ఆసుపత్రి సేవలతో పాటు కేంద్రీకృత రికార్డులను సైతం యాక్సెస్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 2022లో వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 19 వెబ్‌సైట్లపై రాన్సమ్‌ దాడులు జరిగాయి.

ఆయా సైట్లపై ఇండోనేషియా ‘హాక్టివిస్ట్‌’ సంస్థ డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ (డిడిఓఎస్), డినియల్ ఆఫ్ సర్వీస్ (డిఓఎస్) దాడులను నిర్వహిస్తున్నట్లుగా హెచ్చరించింది. అయితే, హ్యాక్‌టివిస్ట్‌ లక్ష్యంగా చేసుకున్నట్లుగా పేర్కొన్న వెబ్‌సైట్‌ల జాబితా వెలుగు చూసింది. దాంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లు ఉన్నాయి.

బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపూర్‌ శర్మ మహ్మద్‌ ప్రవకర్తపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలేషియా హ్యాక్‌టివిస్ట్ ముఠాలు గత ఏడాది భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా దాడికి పాల్పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ పింగ్‌సేఫ్‌  సీఈవో ఆనంద్ ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అన్ని సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌లు కొనసాగుతున్నాయి.

ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే ఏదైనా లింక్‌, ఈమెయిల్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్‌ చేయొద్దని సూచించారు. దాంతో వైబ్‌సైట్ల భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.