డీఎంకే కీలక నేతలకు చెందిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో సుదీర్ఘ జాబితాను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విడుదల చేయడం ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్తో పాటు ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పోన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, మాజీ కేంద్ర మంత్రి ఎస్ జగత్రక్షకన్తో సహా డీఎంకే కీలక నేతలకు చెందిన ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
డీఎంకే నేతలకు చెందిన ఈ ఆస్తులన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలో పేర్కొన్నవే అని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టులు వీటిని వెరిఫై చేసుకోవాలని సూచిస్తూ వారం రోజుల తర్వాత ఈ లిస్ట్పై జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెబుతానని తెలిపారు.
గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నై మెట్రో రైలు కాంట్రాక్టును దక్కించుకునేందుకు ఒక కంపెనీకి అనుకూలంగా వ్యవహరించినందుకు రూ.200 కోట్లు లంచంగా ఇచ్చినట్లు అన్నామలై ఆరోపించారు. విదేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగాయని చెప్పారు.
ఒక్క డీఎంకే నేతల కుంభకోణాలను మాత్రమే కాదని, అన్ని పార్టీల అవినీతి బాగోతాలను తమిళనాడు ప్రజల ముందు ఉంచుతానని అన్నామలై స్పష్టం చేశారు. ‘నా భూమి.. నా ప్రజలు’ పేరుతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డీఎంకే నేతల అవినీతిని ప్రజల ముందు బట్టబయలు చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
జూన్ మొదటి వారం నుంచి ఈ పాదయాత్ర మొదలవుతుందని, బీజేపీ శ్రేణులు ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ విడుదల చేసిన డీఎంకే నేతల అవినీతి చిట్టా పార్ట్-1 మాత్రమేనని, ఈ సంవత్సరం అంతా ఈ సిరీస్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ట్విటర్లో కూడా తమిళనాడు బీజేపీ యాక్టివ్గా ప్రచారం చేస్తోంది.
ట్విటర్లో DMKFiles, Annamalai ట్రెండింగ్లో ఉండటం గమనార్హం. ‘కె.అన్నామలై’ అధికారిక ట్విటర్ ఖాతాతో పాటు, ‘ఆర్మీ ఆఫ్ ధీరన్ అన్నామలై’ అనే ట్విటర్ అకౌంట్లో కూడా డీఎంకే ఫైల్స్ వీడియోలతో బీజేపీ సోషల్ మీడియా విభాగం హోరెత్తిస్తోంది. డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి ఈ ఆరోపణలను జోక్ అంటూ ఆయన పేర్కొన్న డీఎంకే నేతలంతా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారని తెలిపారు. వాటిలో ఏ ఒక్కటి తప్పుగా అనిపించినా వారి ఎన్నికను ప్రజలు సవాల్ చేయవచ్చని సూచించారు.
మరోవైపు రూ.200 కోట్లు లంచం ఇచ్చినట్లుగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేయాలని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి, ఎంపీ ఆర్ఎస్ భారతి సవాల్ విసిరారు. అదానీ కంపెనీలు పాల్పడిన అవకతవకల వ్యవహారం గురించి హిండెన్బర్గ్ నివేదికపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో తప్పుడు నివేదికను ఆయన విడుదల చేశారని దుయ్యబట్టారు.
ఆయన ఆరోపించిన చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ అవినీతిపై 2014 నుంచి సీబీఐ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఇలాంటి చవకబారు ఆరోపణలతో డీఎంకే ప్రతిష్టకు ఎలాంటి నష్టం జరుగదని అన్నారు.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు