ఏపీలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి

ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని బిజెపి నేత,  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ధ్వజమెత్తారు. విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్‌ నిర్వహించిన ర్యాలీలో పాల్గొంటూ ఈ వాఖ్యలు చేశారు.
 
తెలంగాణతో పాటూ ఏపీ కూడా వెనుకబడి ఉందని చెబుతూ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. రాష్ట్రాలు విభజన అయ్యాక కూడా ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. పాడేరు వచ్చే జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటె, రోడ్లు అధ్వాన్నంగా ఉంటె, ఇక మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.
 
విశాఖపట్నం నుండి పాడేరుకు 80 కిమీ దూరం కారులో ప్రయాణించేందుకు తనకు మూడున్నర గంటల సమయం పట్టిందని బాబురావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది అనుకున్నానని, తీరా ఏపీకి వచ్చి చూస్తే ఇక్కడ కూడా మరీ అధ్వాన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.
 
ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని చెబుతూ స్థానికులు పాడేరు నుంచి విశాఖ ఎలా వెళుతున్నారో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. కొన్ని గిరిజన గ్రామాల్లో ఒక్కరు కూడా చదువుకోనివారు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని బాబురావు కోరారు.