ప్రధాని కార్యక్రమంకు రాలేనంత పని కేసీఆర్ కు ఏముంది?

ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వచ్చినా ఆయన కార్యక్రమానికి హాజరుకాలేనంత ముఖ్యమైన పని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏముందో ప్రజలకు చెప్పాలని కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి  డిమాండ్ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటారన్న ఆయన, కేసీఆర్ ఫాం హౌస్ లేదా ప్రగతి భవన్ వీడి బయటకు రారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి మంత్రులతో ప్రధానిని తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు కేసీఆర్‌తో వైరం లేదని, తెలంగాణ ప్రజలతో ఆయనకు వైరం ఉందని స్పష్టం చేశారు.  అన్ని ప్రభుత్వ వేదికల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానిని విమర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి, అహంకార, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించడానికి మోదీ వస్తే అప్పుడు కూడా కేసీఆర్ రాలేదని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆయనకు ఏమాత్రం ఆలోచన లేదని, తాను పీఎం కావాలని, తన కొడుకు సీఎం కావాలన్న తాపత్రయం తప్ప మరేమీ లేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రధాని తెలంగాణకు వచ్చారని చెప్పుకొచ్చారు. కనీస సంప్రదాయాలు పాటించకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

రీజినల్ రింగ్ రోడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదని, భూసేకరణలో కూడా సగం కేంద్రం భరిస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఎయిమ్స్ ఆస్పత్రి పనులు సహా అనేక ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి ఉన్నాయని తెలిపారు.

ఇన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రావడానికి సీఎం కేసీఆర్‌కు సమయం లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వేదిక మీద సీఎం కోసం కుర్చీ కూడా సిద్ధం చేసి ఉంచినా సరే ఆయన రాలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎలా జైల్లో పెట్టాలి అన్న విషయం మీదే ఆయన దృష్టి ఉందని విమర్శించారు.

కేసీఆర్ వందల వేల ఎకరాల భూములను సెటిల్ చేస్తూ వేల కోట్లు పోగేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు భరిస్తా అని కేసీఆర్ చెప్పారని, అంత డబ్బు ఆయనకు ఎక్కడిదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.