మాస్కులు తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు

మాస్కులు తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి.
 
తాజాగా మూడు రాష్ట్రాలు మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశాయి. హర్యానా, కేరళ, పుదుచ్చేరిలో లలో బహరింగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించాయి. కాగా, కరోనా నాలుగో వేవ్‌పై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తున్నది.
 
సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహింనుంది. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కరోనా సన్నద్ధతను పరిశీలించనున్నారు. కాగా, కోవిడ్‌ మ్యూటేషన్‌ ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ అయిన బీఎఫ్‌.7, ప్రస్తుతం ఎక్స్‌బీబీ1.16 సబ్‌ వేరియంట్‌ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
 
ఈ సబ్‌వేరియంట్లతో పెద్దగా ప్రమాదం లేకపోయినా కేసులు వేగంగా పెరగడానికి దోహదపడుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.ఇక కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటించాలని కోరింది.
 
కేరళ ప్రభుత్వం గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దవాఖానలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది కూడా మాస్కులు ధరించాలని ఆదేశించింది.
 
 రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని ఉత్తరప్రదేశ్‌  ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరనా పాజిటివ్‌గా తేలితే ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది. గత కొన్ని రోజులుగా- రోజువారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు పైన నమోదవుతోంది.
 
గడచిన 24 గంటల్లో భారత్ లో 5,357 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 11 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.  పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది. కాగా, భారత్ జనాభాతో పోల్చితే, ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరమేమీ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
భారత్ లో ప్రస్తుతం ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 2 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే న్యూజిలాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.