మరో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకైన్నట్లు వెల్లడి

మరో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకైన్నట్లు వెల్లడి

టీఎస్‌పీఎస్సీ  ప్రశ్నపత్రాల లీకేజీలకు అంతులేకుండా పోతున్నది. తాజాగా డీఏవో (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) ప్రశ్నపత్రం కూడా లీకయి,ఇ తరుల చేతికి అందినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఏఈ, గ్రూప్‌-1, డీఏవో, టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ, ఎంవీఐ, గ్రౌండ్‌ వాటర్‌.. ఇలా మొత్తం 7 పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల పెన్‌డ్రైవ్‌, మొబైల్స్‌లో సిట్‌ అధికారులు గుర్తించారు.

 దాంతో ఆ పరీక్షలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. అయితే వీటిలో గ్రూప్‌-1, ఏఈ పరీక్షల ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇతరులకు విక్రయించినట్లు ఇప్పటిదాకా గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా 15 మంది నిందితులను అరెస్టు చేసి లోతుగా విచారణ జరిపారు.

ఈ క్రమంలోనే డీఏవో ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌  ఖమ్మంకు చెందిన లౌకిక్‌, సుష్మిత అనే దంపతులకు విక్రయించినట్లు తేలింది. భార్య సుష్మిత కోసం భర్త లౌకిక్‌ ఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం రూ.10 లక్షలకు ఒప్పందంద చేసుకొని, ముందుగా రూ.6 లక్షలు ప్రవీణ్‌కు చెల్లించినట్లు నిర్ధారించారు.  ప్రవీణ్‌ బ్యాంకు ఖాతా లావాదేవీల ఆధారంగా ఈ విషయాన్ని సిట్‌ అధికారులు తెలుసుకున్నారు.

ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలోని లావాదేవీలను విశ్లేషించిన పోలీసులు లౌకిక్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం నిర్థారణ అయింది. దీంతో సుష్మితను, లౌకిక్‌ను కూడా అరెస్టు చేశారు. ఇద్దరి అరెస్టుతో టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 17కు చేరింది.

 ఇదిలా ఉండగా.. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌, మొబైల్స్‌లోని డేటాను ఫోరెన్సిక్‌ నిపుణులు విశ్లేషించి, రిపోర్టును సీల్డ్‌కవర్‌లో సిట్‌కు అందించినట్లు తెలిసింది. 11న సిట్‌ అధికారులు విచారణ రిపోర్టును హైకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో, ఫోరెన్సిక్‌ నివేదికను సైతం కోర్టుకు అందజేసే అవకాశం ఉంది.