బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్

టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్  హన్మకొండ ప్రిన్సిపల్  మెజిస్ట్రేట్ కోర్టు విధించింది. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ బుధవారం రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులుగా ఉన్న ప్రశాంత్, మహేష్, శివ గణేష్ లను కూడా ఆయనతో పాటు కరీంనగర్ జైలుకు తరలించారు
 
ఈ కేసులో ఏ1గా పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో ఇరువైపులా వాదనలు విన్న మెజిస్ట్రేట్ పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను పూర్తిగా పరిశీలించి ఈమేరకు తీర్పు వెలువరించింది.
 
అయితే పోలీసులు తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి సంజయ్ వివరించారు. చొక్కా విప్పి మరీ తనకు తగిలిన గాయాలను న్యాయవాదులకు బండి సంజయ్ చూపించారు. దీంతో న్యాయమూర్తి నివాసంలో ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వినిపించగా  14 రోజుల రిమాండ్ విధించారు.
 
ఇదిలా ఉంటే, బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు బండి సంజయ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ మీద గురువారం ఉదయం పదిన్నరకు విచారించనున్నారు. మరోవైపు.. పోలీసులు మాత్రం బండి సంజయ్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో హన్మకొడ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ముందు మధ్యాహ్నం నుంచి భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్‌ని కోర్టుకు తరలించే సమయంలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ శ్రేణులు నిరసలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఒకానొక చోట  బండి సంజయ్‌ని తరలిస్తోన్న వాహనంపై చెప్పులు, కోడి గుడ్లు కూడా విసిరారు. ఈ క్రమంలోనే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
 
కాగా, వరంగల్ పోలీసులు ప్రశ్నాపత్రాల కేసులో కుట్ర ఉందని, అతని నుంచి  మరిన్ని ఆధారాలు సేకరించాలని కోర్టుకు తెలిపారు. తమ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  ఇరువైపుల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్ విధించింది.   కోర్టు రిమాండ్ పై నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మొత్తం ప‌ది మందిపై కేసులు న‌మోదు చేశారు. న‌లుగురిని అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. మ‌రో నలుగురు ప‌రారీలో ఉన్న‌ట్లు రిమాండ్ రిపోర్టులో వెల్ల‌డించారు. భారీ భద్రత నడుమ సంజయ్ ను కరీంనగర్ జైలుకి పోలీసులు తరలించారు.  బీజేపీ  నాయకులు జైలు దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో   కరీంనగర్ జైలు వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎవరిని జైలు వద్దకు రాకుండా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు.  ముందే జైలు దగ్గరికి వచ్చిన  బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు.