ఐదు రాష్ట్రాల్లో కొత్తగా పది అణు రియాక్టర్లు

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కొత్తగా పది అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ బుధవారం పార్లమెంటుకు ఈ విషయాన్ని తెలిపారు. కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
 
ఆయా రాష్ట్రాల్లోని అణు విద్యుత్ ప్లాంట్లలో కొత్త అణు రియాక్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థ శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ‘అణు రియాక్టర్ల ఏర్పాటు కోసం పీఎస్‌యూలను ప్రభుత్వం వినియోగిస్తుంది. లేదా ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వీటి ఏర్పాటుకు కసరత్తు జరుపుతుంది’ అని లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

కాగా, కర్ణాటకలోని కైగా, మధ్యప్రదేశ్‌లోని చుట్కా, ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ అణు విద్యుత్ ప్లాంట్‌లలో రెండు చొప్పున అణు రియాక్టర్లు, రాజస్థాన్‌లోని మహి బన్‌స్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో నాలుగు అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలతో ఎన్పీసీఐఎల్ జాయింట్ వెంచర్లు, అణు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించినట్లు చెప్పారు. రూ.1,05,000 కోట్ల వ్యయంతో పది అణు రియాక్టర్లను 2031 నాటికి ‘ఫ్లీట్ మోడ్’ విధానంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని పేర్కొన్నారు.

మరోవైపు దేశీయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ అణు రియాక్టర్ల ఏర్పాటుకు పరిపాలన, ఆర్థిక పరమైన అనుమతులను కేంద్రం ఆమోదించినట్లు అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే ఒక్కో అణు రియాక్టర్‌ ద్వారా 700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందన్నారు. 2021-22లో అణు విద్యుత్ రియాక్టర్లు 47,112 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయని తెలిపారు. దేశంలో ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌లో ఇది 3.15 శాతమని వివరించారు.