బండి సంజయ్ బెయిల్ పిటిషన్‍ కు హైకోర్టు అనుమతి

పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఇటీవల బీజేపీ లీగల్ సెల్ బండి సంజయ్ కు బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఏప్రిల్ 7, 8, 9 మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయని సంజయ్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు వాదించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. పేపర్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఓ రాజకీయవేత్తగా బండి సంజయ్ కు ప్రశ్నపత్రం వస్తే దానికే ఆయనను దోషిగా ఎలా పరిగణిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది.

ఓ ప్రతిపక్ష నేతగా  సంజయ్ కు ప్రభుత్వ తప్పులను చెప్పే బాధ్యత ఉందన్న కోర్టు  అయిన చాలా మందికి పేపర్ వెళ్లిన తర్వాతే బండి సంజయ్ కి  వచ్చిందని తెలిపింది. ఏ1గా బండి సంజయ్ పై మోపిన ఆరోపణలకు ఆధారాలేమైనా ఉన్నాయా? అని నిలదీసింది. ఆ తర్వాత సంజయ్ కు బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందంటూ కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణపై వాదించిన మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు సంజయ్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ హాజరవ్వాలని, వరంగల్ కోర్టులో దాఖలైన  బెయిల్ పిటిషన్ పై ఈ రోజే నిర్ణయం తీసుకునేలా కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. 

వరంగల్ లోయర్ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్  ప్రస్తుతం పెండింగ్ ఉండగా, ఒకవేళ దాన్ని డిస్మిస్ చేస్తే, హైకోర్టులో హౌస్ మోషన్ కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు చెప్పినట్టు రాంచందర్ రావు స్పష్టం చేశారు. సంజయ్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరపు న్యాయవాది బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. పదో తరగతి ప్రశ్న పత్రాల కేసులో సంజయ్ ప్రధాన కుట్ర సూత్రదారిగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ సంజయ్ తన సెల్ ఫోన్ ను అందించలేదని తెలిపారు.

 ఈ కేసులో ఏ2 గా భావిస్తోన్న ప్రశాంత్ తో  సంజయ్ మాట్లాడిన ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చెయాలని కుట్ర చేశారని బీఎస్ ప్రసాద్,  కోర్టుకు నివేదించారు.