వైఎస్ జగన్ పాలనపై దృష్టి సారించిన గవర్నర్ నజీర్

గత నెలలోనే ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్‌ నజీర్‌ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై దృష్టిసారించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఆర్థిక అంశాలపై విపక్ష పార్టీలు తరుచూ విమర్శలు చేస్తున్న నేపధ్యంలో కీలక శాఖల పనితీరుపై నెలవారీ నివేదికలు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గత నెల 29న గవర్నర్‌ కార్యాలయం నుంచి పాలనాపరమైన అంశాలపై ప్రతినెలా నివేదిక పంపాలంటూ సాధారణ పరిపాలన శాఖకు లేఖ అందింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి నివేదిక పంపాల్సి ఉన్నందున ప్రతి నెలా 3లోగా ఆయా అంశాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. మరో రెండు రోజులు అదనపు సమయం తీసుకోవచ్చు తప్ప అంతకు మించి జాప్యం చేయవద్దంటూ ఆదేశించడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో ఇటీవల పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో గవర్నర్‌ కార్యాలయం నుంచి ఈ తరహా ఆదేశాలు రావడం విశేషం. రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రజల స్థితిగతులు, కీలక రంగాల్లో అభివృద్ధి వంటి అంశాపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ప్రాథాన్యతా స్కీముల వివరాలు అడిగారు.

రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ప్రజలపై ప్రభావం వంటి అంశాలను పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో సాధించిన వృద్ధిపై నివేదిక కోరారు. నీటిపారుదల రంగంలో పరిస్థితులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంతో పాటు వైద్య సేవలు, సామాజిక ఫెన్షన్లు, నిత్యావసర సరుకుల పంపినీ, విద్యుత్‌ సరఫరా, ఇంధన రంగం వృద్ధి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, ఎస్సీ, ఎస్టీల కేసుల నమోదు వంటి పలు అంశాలపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది.

రాష్ట్రంలో పేదలకు గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన చర్యలు, పిల్లలు, మహిళల సంక్షేమ పథకాలు, బాలికా విద్య, వికలాంగుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆ నివేదికలో పొందుపరచాలని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆయా పార్టీలు ప్రభుత్వంపై విమర్శులు సంధిస్తున్నారు. కొందరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గవర్నర్‌ కార్యాలయం స్పందించడం కీలకంగా మారింది. గత టిడిపి ప్రభుత్వంలో కూడా ఎన్నిలకు ముందు ఇదే తరహాలో గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు చెపుతున్నారు.