విజయవాడలో ఆర్టీసీ బస్సులో డ్రగ్స్

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే డ్రగ్ మాఫియా ఉండేది. ఇప్పుడు విశాఖ, విజయవాడ వంటి నగరాలకు కూడ డ్రగ్స్ దందా వ్యాపిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని   విజయవాడలో డ్రగ్స్ కలకలం రేపాయి.

నగరంలో బెంగుళూరు నుంచి వచ్చిన అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కిలో ఎండీఎంఎ డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తనకు గుర్తు తెలియని వ్యక్తి  బ్యాగ్ ఇచ్చి విజయవాడలో అందజేయాలని చెప్పారని పోలీసులకు బస్సు డ్రైవర్ చెప్పారు.

ప్రస్తుతం డ్రైవర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. బస్సుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుర్తు తెలియని వ్యక్తి ఎండీఎంఎ డ్రగ్స్ ను స్కూల్ బ్యాగులో విజయవాడలో అందజేయాలని ఇచ్చాడని తెలిపారు.

అయితే గతంలో కూడా విజయవాడలో డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తూ దండగులు పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ బస్సులోనే డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. దీంతో నగరవాసులు పెరుగుతున్న డ్రగ్స్ దందాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విశాఖలో కూడా గంజాయి సరఫరా యధేచ్ఛేగా సాగుతోంది. ఇటీవల కాలంలో పలుసార్లు గంజాయిని అధికారులు పట్టుకున్నారు.