క్రిమిసంహారకాలను మితిమీరి వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ

తెలంగాణలో రైతులు మితిమీరి వినియోగిస్తున్నారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలోనే రైతులు అత్యధికంగా క్రిమిసంహారకాలను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో రాష్ట్రంలో సగటున 262 మెట్రిక్‌ టన్నుల పురుగు మందులను వినియోగిస్తుండగా ఇప్పుడి ఏకంగా 5వేల మెట్రిక్‌ టన్నులకు చేరడం వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో క్రిమిసంహారకాల వినియోగం కూడా భారీగా పెరుగుతోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా  క్రిమిసంహారకాలను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్‌, ఆ తర్వాతి స్థానంలో పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకంతో నేలసారం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చేలకు కొద్దిపాటి చీడ, పీడ ల లక్షణాలు కనిపించిన వెంటనే పెస్టిసైడ్స్‌ కంపెనీల వ్యాపార ప్రకటనలు చూసి, ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు అంటగడుతున్న క్రిమిసంహారకాలను రైతులు విచ్చలవిడిగా పంటలపై చల్లుతున్నారు.

ఫలితంగా రైతుకు ఆర్థికంగా పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు నేలసారం దెబ్బతినడం, పంట ఉత్పత్తుల అవశేషాల్లోనూ హానికార రసాయనాలు చేరుతున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. రసాయన మందుల వాడకం వల్ల దిగుబడులు పెరుగుతాయన్నది వట్టి అపోహ మాత్రమేనని, సీజన్‌లోని వాతావరణ అనుకూల పరిస్థితుల వల్ల దిగుబడులు పెరుగాయని, అయితే అది క్రిమిసంహారకాల వాడకం వల్లనే పెరిగిందని రైతులు భావిస్తున్నారని వ్యవసాయశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ చెప్పారు.