పేపర్ లీకేజీ కేసులో నిందితుడిపై లుకౌట్ నోటీసులు

టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఈ కేసులో లీలగా నిందితుడు రాజశేఖర్ రెడ్డికి బావ వరుసయ్యే ప్రశాంత్ కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా సమాచారం. ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉంటుండగా అతనికి రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం చేరింది.

 దీంతో ప్రశాంత్ అక్కడే పేపర్‌లో ప్రశ్నలకు జవాబులు ప్రిపేర్ అయి ఇక్కొడికి వచ్చి పరీక్ష రాశాడు. అనంతరం తిరగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు కూడా వచ్చినట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన సిట్ అధికారులు వాట్సాప్, మెయిల్ ద్వారా ప్రశాంత్‌ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు.

అయితే సిట్ అధికారులకు ప్రశాంత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి కోసం సిట్ అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశారు. మరోవంక, పేపర్ లీకేజీ కేసులో రెండో రోజు సిట్ కస్టడీ ముగిసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌ను సిట్ ప్రశ్నించింది.

మరోవైపు గ్రూప్-1 పరీక్ష రాసిన 40 మందిని కూడా సిట్ ప్రశ్నించింది. 40 మందికి సిట్ అధికారులు ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష రాసిన 40 మందికి లీక్‌తో దాదాపు సంబంధం లేదని నిర్ధారించారు. సిట్ తమదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రవీణ్ నోరు విప్పినట్లు సమాచారం. నిందితుడు ప్రవీణ్ ఇంట్లో రూ. 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనంగా శంకర్‌లక్ష్మి డైరీలోని పాస్‌వర్డ్ తెలుసుకుని కంప్యూటర్‌లో డేటా చోరీ చేసినట్లు తేల్చింది. రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ పొందాడు. ఏఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో దళారీగా వ్యవహరించిన డాక్యా నుంచి ప్రశ్నాపత్రాన్ని తీసుకొని రాజేందర్‌కు విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు డాక్యా అండ్ గ్యాంగ్ బ్లాక్ టికెట్ల మాదిరిగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకరి నుంచి ఒకరికి దాదాపు వంద మందికి ప్రశ్నాపత్రం చేరినట్లు భావిస్తున్నారు.

 కాగా రేణుక, డాక్యా నుంచి అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా, సిట్ అధికారులు గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 150 మా ర్కులకు గానూ వందకు పైగా మార్కులు సాధించిన అ భ్యర్థులందరి జాబితాను సేకరించారు. ఇందులో సిట్ అధికారులు పలువురిని విచారణకు పిలుస్తున్నారు.