సింగరేణి కొలువుల్లోనూ అక్రమాలపై బిజెపి అధ్యయనం

కేసీఆర్ పాలనలో జరిగిన అన్ని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా సింగరేణి కొలువుల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించేందుకు సిద్ధమైంది.  దీంతోపాటు అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పర్యటించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో టీఎస్సీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది.
 
టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్ అధ్యక్షతన పేపర్ లీక్ పై ఏర్పాటైన బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ  సమావేశంలో టాస్క్ ఫోర్స్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి క్రిష్ణ ప్రసాద్, మహిళా మోర్చా జాతీయ నేత కరుణా గోపాల్ హాజరయ్యారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. దీంతోపాటు కేసీఆర్ పాలనలో జరిగిన అవకతవకలపైనా ద్రుష్టి సారించాలని నిర్ణయించారు.
 
 ముఖ్యంగా సింగరేణి నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా ద్రుష్టి సారించాలని నిర్ణయించారు. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి న్యాయ పోరాటం చేయాలనే సమావేశం నిర్ణయించింది.