రాహుల్ బీసీలకు క్షమాపణ చెప్పాలి

నరేంద్ర మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్,  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలతో కలిసి శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ ఇంటి పేరు సహా ఓబీసీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష విధించిందని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వం, కులం గురించి ఇష్టమొచ్చినట్టు రాహుల్ మాట్లాడడం ఇది మొదటిసారి కాదని ఆరోపించారు.

బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే పరిగణిస్తూ నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మోదీ కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు చోటు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.

తన వంటి ఓ సామాన్య కార్యకర్తకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటరీ బోర్డులో అవకాశం కల్పించారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కోర్టు తీర్పును బీజేపీ తీర్పుగా చిత్రీకరిస్తూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీసీలను సంఘటితం చేస్తామని, తెలంగాణలో బీజేపీని అజేయ శక్తిగా తీర్చిదిద్దుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.