సీపీఎం పొలిట్‌ బ్యూరోకు రాఘవులు రాజీనామా

సీపీఎం అగ్రనేత బివి రాఘవులు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐ లో పని చేస్తూ క్రమేణా పార్టీలో ఎదిగిన రాఘవులు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేసారు.  సీపీఎం సంస్థాగత నిర్మాణంలో రాఘవులు కీలకంగా వ్యవహరించారు.
జాతీయ స్థాయిలోనూ రాఘవులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. అయితే, కొంతకాలంగా ఏపీలో పార్టీలో తీవ్రమవుతున్న అంతర్గత కుమ్ములాటలు కారణంగా రాఘవులు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.  ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘువులు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా వెనక్కి తీసుకోవాలని అగ్రనేతలు రాఘవులును బుజ్జగిస్తున్నారు.
అయినా వెనక్కు తగ్గని రాఘువులు సాధారణ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులతోనే రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఇప్పటివరకు ఆమోదించలేదు. ఏపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఆయన రాజీనామాకు కారణమని పార్టీ వర్గాలంటున్నాయి.
 
దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏపీ సిపిఎంలో అంతాతానే అన్నట్లుగా వ్యవహరించిన రాఘవులు ధోరణి నచ్చక పలువురు ప్రముఖ నేతలు పార్టీకి దూరమయ్యారు.   ఒకనాడు బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు సిపిఎంతో పొత్తుల కోసం పోటీ పడుతూ ఉండేవి. ఒకసారి టిడిపితో, మరోసారి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొంటూ గౌరవనీయ స్థానంలో అసెంబ్లీ, ఎంపీ సీట్లు పొందుతూ ఉండేవారు.
 
 అయితే, 2009 నుండి ఏపార్టీ కూడా సిపిఎంతో పొత్తు పట్ల ఆసక్తి చూపడం లేదు. చివరికి తోటి వామపక్షం సిపిఐ సహితం సిపిఎం ధోరణుల పట్ల అసహనంతో ఉంటూ వస్తోంది.   పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అత్యధికులు కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ కు మద్దతు ఇవ్వగా, సాంకేతిల అభ్యంతరాలను లేవనెత్తి రాఘవులు తన శిష్యుడు నరసింగరావును కార్యదర్శిగా చేశారనే విమర్శలు ఉన్నాయి. అప్పటి నుండి గఫూర్‌ తీవ్ర అసంతృతీపితో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేశారనే వదంతులు కూడా  ఆ మధ్య వచ్చాయి.