‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ 100వ ఎడిసోడ్ ఈసారి ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానుంది. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ భారీ సన్నాహాలు చేస్తోంది.  ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది.

”ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు అంతర్జాతీయ నేత. ఆ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ప్రసారం చేయనున్నాం. మోదీ పనితీరును ప్రపంచ దేశాలన్నీ అభినందిస్తున్నాయి. ప్రజలు ఆయన మాటలను వినాలనుకుంటున్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సాధ్యమైనన్ని దేశాల్లో ప్రసారం చేయడమే మా లక్ష్యం” అని బీజేపీ వర్గాలు తెలిపాయి.

‘మన్ కీ బాత్’ సిరీస్‌లో మోదీ ప్రస్తావించిన ప్రతిభావంతులందరినీ గౌరవించడంతో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు ఆయా రాష్ట్రాల్లో వారిని ఆహ్వానిస్తారని, అంతగా ప్రచారానికి నోచుకుని ఈ ప్రముఖులందర్నీ ఢిల్లీకి కూడా ఆహ్వానిస్తామని ఆ వర్గాలు తెలిపాయి. అనేక విశేషాలతో100వ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నట్టు చెప్పారు.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 100 ప్రాంతాల్లో 100 మంది చొప్పున కూర్చుని ప్రధాని మన్‌కీ బాత్ వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్‌‌ గౌరవం అందుకున్న వారిని గౌరవించడంతో పాటు వారి స్పందనలు కూడా వినే అవకాశం ఉంది.

ఈ ఎపిసోడ్‌ ఘనవిజయం సాధించేందుకు వీలుగా లక్షకు పైగా బూత్‌లలో దీనిని టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైనప్పటికీ ఏమాత్రం గుర్తింపునకు నోచుకోని వారి సేవలను ‘మన్ కీ బాత్’ ద్వారా వెలుగులోకి తేవడం జరుగుతోంది.

వీటితో పాటు వాతావరణ మార్పులు, వ్యవసాయం, కళలు, సంస్కృతి, ఆరోగ్యం వంటి అంశాలు సందర్భానుసారంగా ఈ కార్యక్రమంలో  చోటుచేసుకుంటున్నాయి. యావద్దేశాన్ని ఏకతాటిపైకి తేవడం, సమష్టి అభివృద్ధి సాధన లక్ష్యంగా ‘మన్ కీ బాత్’ ముందుకు సాగుతోంది.