తీన్మార్ మల్లన్న అరెస్ట్..!

సీనియర్ జర్నలిస్టు, రాజకీయ నేత ‘తీన్మార్’ మల్లన్నను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయం చెప్పడం లేదని చానెల్ సిబ్బంది తెలిపారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఫిర్జాదిగుడాలోని మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ ఆఫీస్‌కు చేరుకున్న 20 మంది పోలీసులు సోదాలు చేపట్టారు. మల్లన్న ఆఫీస్‌లో పని చేస్తున్న సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
 
క్యూ న్యూస్ ఆఫీస్‌లోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను పరిశీలించారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత రెండు రోజులుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వార్తా సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.
 
2 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆదివారం మధ్యాహ్నం దాదాపు 20 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యూ న్యూస్ ఛానల్ సిబ్బందితో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
 
అనంతరం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను బయటకు వెళ్లిన సమయంలో వచ్చి తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న తెలిపారు. గతంలో సైతం క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు చేసిన వారిని ఇప్పటికీ ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇలా ఉండగా, ఆదివారం క్యూ న్యూస్​ఆఫీసులో కంప్యూటర్లు, ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేస్తూ సిబ్బందికి పట్టుబడ్డ సాయి కిరణ్​గౌడ్​ మల్లన్న, క్యూ న్యూస్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను తీవ్రంగా కొట్టి, హింసించి హత్య చేసేందుకు ప్రయత్నించారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మల్లన్న, తెలంగాణ విఠల్, క్యూ న్యూస్​సిబ్బందిపై పోలీసులు ఐపీసీ 307 సెక్షన్​కింద హత్యాయత్నం, పలు నాన్​బెయిలబుల్​సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులపై తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటారు. ఒక్కోసారి ఆయన విమర్శలు తీవ్ర వివాదాస్పదం అవుతుంటాయి. ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్నను ఇది వరకే ఓ సారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మారోసారి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.