మోదీ మేక్ ఇన్ ఇండియా అంటే కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా

ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా అంటే సీఎం కేసీఆర్ జోక్ ఇన్ ఇండియా అంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అవహేళన చేయకుండా ప్రోత్సహిస్తే బాగుంటుందని కేసీఆర్ కు ఆయన హితవు పలికారు. మోదీ  మేక్ ఇన్ ఇండియా తీసుకోవాలి తప్పితే.. కల్వకుంట్ల జోకిన్ ఇండియా కింద తీసుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించినందుకు టీచర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కోసం కృషి చేస్తున్న బీజేపీని ఆదరిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీతో మార్పు వస్తుందని భావించారనే దానికి ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో మార్పు తీసుకొస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా టెక్ట్స్ టైల్ రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు పీఎం మిత్ర ద్వారా తెలంగాణకు మెగా టెక్ట్స్ టైల్ పార్కును ప్రధాని కేటాయించారని కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రధాని ప్రత్యేకమైన విజన్ తో తయారీ సంస్థలను నెలకొల్పుతున్నారని చెబుతూ 5 ఎఫ్ విజన్ తో తెలంగాణలో టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటు కానుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం కింద రూ.4445 కోట్లు కేటాయించారు. ఒక్కో టెక్ట్స్ టైల్ పార్కుకు కనీసం వెయ్యి ఎకరాల స్థలం అవసరం అవుతుందని చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశామని తెలిపారు.

అంతర్జాతీయ సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడులను కూడా అహ్వానిస్తామన్నారని పేర్కొంటూ దీంతో లక్ష మందికి నేరుగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. భారతదేశం వివిధ దేశాలతో టెక్స్ట్ టైల్ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్కు పెట్టాలనేది తన వ్యక్తిగత అభిప్రాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ల ఎగుమతిలో చైనా తర్వాత మనమే అగ్రభాగాన ఉన్నామని తెలిపారు. రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పునర్ నిర్మించనున్నామని చెబుతూ వచ్చే నెలలో ప్రధాన మంత్రి నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.

త్వరలో హైదరాబాద్ నుంచి తిరుపతికి మరొక వందే భారత్ రైలును ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్ ఘట్కేసర్ నుంచి యాదాద్రి ఎంఎంటిఎస్ కోసం ఎన్ని సార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు . సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనలో చనిపోయిన ఆరుగురి మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయం కింద రూ. 2 లక్షలు చొప్పున అందివ్వాలని సూచించానని కేంద్ర మంత్రి తెలిపారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీతో బీజేపీకి ఏమిటి సంబందం అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అబద్దాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతుంది కల్వకుంట్ల కుటుంబమని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలతో కేంద్రం మద్యం కుంభకోణంపై సీబీఐని విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు.

 దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కక్కొరుగా బయటకు వచ్చారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం మద్యం వ్యాపారం చేస్తే తమకొచ్చే నష్టమేమీ లేదని, కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంగా కొంపలు మునిగిపోయినట్లు మంత్రివర్గమంతా ఢిల్లీకి వచ్చిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు. మద్యం కేసును  తప్పుదారి పట్టించడానికి ఇదంతా.. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలసి ఉన్నారని ధ్వజమెత్తారు.