గ్రూప్–1లో బీఆర్ఎస్ వారి పిల్లలు, బంధువులు క్వాలిఫై

గ్రూప్-1 పరీక్షల్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని తెలుపుతూ బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పనిచేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు సమాచారం అందుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.  జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై కాగా, ఒక చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై అయ్యారని చెబుతూ వీరంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లే అని స్పష్టం చేశారు. నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతోపాటు ఒక జడ్పీటీసీ వద్ద బాడీగార్డ్ గా పనిచేసే వ్యక్తి కొడుకు క్వాలిఫై అయ్యారని తెలిపారు.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై కాగా ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ క్వాలిఫై చేశారని సంజయ్ వెల్లడించారు. కేసీఆర్ కొడుకు సహకారంతోనే ఇది జరిగిందని, ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశారని స్పష్టం చేశారు. ఒక్కొక్కరి దగ్గర 3 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.
 
తక్షణమే కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.  సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో విచారణ ఎలా సాధ్యం? అని సంజయ్ ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని తెలిపారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని సంజయ్ విమర్శించారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్  కేసులో కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ మార్చి 20న  అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష చేస్తామని సంజయ్ వెల్లడించారు.  కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల భృతి, పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే  డిమాండ్లతో  దీక్ష  జరుగుతుందని తెలిపారు.