అస్సాంలో అన్ని మదర్సాలు మూసేస్తా

అస్సాంలో అన్ని మదర్సాలు మూసేస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ స్పష్టం చేశారు. అస్సాంలో అందరూ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో చదువుకోడానికి ప్రాముఖ్యతనిస్తున్నారని ఆయన తెలిపారు.

‘నేను ఇప్పటికే 600 మదర్సాలు మూయించేశాను. మిగతా అన్నింటినీ మూయించేందుకు సిద్ధంగా ఉన్నాను. మాకు మదర్సాలు వద్దు. మాకు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కావాలి’ అని చెప్పుకొచ్చారు. ఎన్నికలు జరుగనున్న కర్నాటకలోని బెల్గావిలో ఆయన బిజెపి ‘విజయ్ సంకల్ప్ యాత్ర’ ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.

అస్సాంలో 2023 జనవరి నాటికి నమోదైన, నమోదు కాని మదర్సాలు 3000 ఉన్నాయి. ఇప్పుడున్న మదర్సాలన్నీ ‘రెగ్యులర్ స్కూల్స్’గా మారుస్తామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి అక్రమ వలసలు పెరిగిపోతున్నాయని చెబుతూదీంతో అస్సాం నాగరికతకు, సంస్కృతికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆధునిక భారత్‌లో మదర్సాల అవసరం లేదని స్పష్టం చేస్తూ కాంగ్రెస్‌ వ్యక్తులు, కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరించారని, వాస్తవాలను తప్పుగా చూపారని ఆయన ఆరోపించారు. వక్రీకరించిన చరిత్రను కొత్త మార్గంలో తిరగరాయాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై కూడా విరుచుకుపడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీని మొగల్స్‌తో పోల్చారు. వారు దేశాన్ని బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. బాబ్రీ మస్జిద్ వివాదాన్ని వారు మళ్లీ లేవనెత్తుతుని, అయోధ్యలో రాముడి మందిరం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నారని అంటూ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ లో రాహుల్ గాంధీ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతను ఎప్పటికి భారత దేశ ప్రధాని కాలేరని స్పష్టం చేశారు.