జాతీయ వ్యతిరేక టూల్‌కిట్లో రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతీయ వ్యతిరేక టూల్‌కిట్ లో భాగంగా మారిపోయారని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వామి కావడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.  జేపీ నడ్డా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటుండటం దురదృష్టకరం. దేశం పదే పదే తిరస్కరిస్తుండటంతో రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ వ్యతిరేక టూల్‌‌కిట్‌లో భాగస్వామిగా మారారు’’ అంటూ ధ్వజమెత్తారు.

భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో వేరొక దేశం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన రాహుల్ గాంధీని ప్రశ్నించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచే దిశగా దూసుకెళ్తోందని, మరోవైపు జీ20 సమావేశాలు మన దేశంలో జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆయన విదేశాలకు వెళ్లి, భారతదేశాన్ని, పార్లమెంటును అవమానించారని నడ్డా మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, భారత దేశ ప్రజాస్వామిక మౌలిక నిర్మాణం దాడికి గురవుతోందని, పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.  అన్ని వ్యవస్థల్లోనూ బీజేపీ, ఆరెస్సెస్ చొచ్చుకెళ్లాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని పార్లమెంటులో బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఆక్స్‌ఫోర్డ్ ఆహ్వానాన్ని తోసిపుచ్చిన వరుణ్‌గాంధీ

లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం రేగుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆక్స్‌ఫోర్స్ యూనివర్శిటీ తనకు పంపిన ఆహ్వానాన్ని తోసిపుచ్చారు. ”ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియా సరైన మార్గంలో పయనిస్తోందా?” అనే అంశంపై చర్చలో పాల్గొనాలంటూ పూర్వవిద్యార్థి అయిన వరుణ్‌ను ఆక్ఫ్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఆహ్వానించింది.
 
అంతర్జాతీయ వేదికపై దేశీయ సవాళ్ల గురించి మాట్లాడటంలో ఎలాంటి మెరిట్ కానీ, ఔచిత్యం కానీ తనకు కనిపించ లేదని, ఇది ”అగౌరవప్రదమైన చర్య” అని ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ స్పష్టం చేశారు.