కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల వాయిదా

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణ కోసం ఫిబ్రవరి 17న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఈ మేరకు రక్షణశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
 సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ తో పాటు దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డులకు  ఎన్నికల  నిర్వహణకు గాను గత నెల 17న కేంద్రం నోటిఫికేషన్  ను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్న తరుణంగా కేంద్రం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
గత నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు మార్చి 28, 29 తేదీల్లో నామినేషన్లు స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలో చేపట్టిన కొత్త ఓటర్ల ప్రక్రియను మార్చి 4న ముగించారు. ఇదిలా ఉండగానే కంటోన్మెంట్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ కూడా మరోవైపు కొనసాగుతోంది.
 
దీంతో కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  ఈ విషయాన్ని అధికారులు, కొన్ని రాజకీయ పార్టీల నేతలు కేంద్ర రక్షణ శాఖ దృష్టికి తీసుకొచ్చారు.  ఇదే సమయంలో దేశంలోని మరికొన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు ఆరు నెలల పాటు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కూడా రక్షణ శాఖను కోరారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని కంటోన్మెంట్ల ఎన్నికలపై ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ రక్షణ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.