విదేశీ లాయర్లు, న్యాయ సంస్థలకు భారత్ లో ప్రవేశం!

భారతదేశంలో ఫారెన్ లాను ప్రాక్టీస్ చేసేందుకు విదేశీ లాయర్లు, న్యాయ సంస్థలకు అనుమతిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ లాయర్లు, అర్బిట్రేషన్ లాయర్లు భారత్ లో అడ్వైజ్ ఇచ్చేందుకు వీలుగా రూల్స్ ఫర్ రిజిస్టేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫారెన్ లాయర్స్‌ అండ్ లా ఫర్మ్స్ ఇన్ ఇండియా-2022ను బీసీఐ రూపొందించింది.

”భారత్ లో ఫారెన్ లాను ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా విదేశీ లాయర్లు, న్యాయ సంస్థలకు అనుమతించే సమయం వచ్చింది. అంతర్జాతీయ లీగల్ అంశాలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కేసుల్లో విదేశీ లాయర్లకు భారత్ లో లా ప్రాక్టీసుకు అనుమతించడం వల్ల లీగల్ ప్రొఫెషన్‌కు సహాయకారి అవుతుంది. భారత్ లో లాయర్లకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది” అని బీసీబీ పేర్కొంది.

ఆంక్షలు, పూర్తి నియంత్రణ, రెగ్యులేషన్ విధానంలో విదేశీ లాయర్లను లా ప్రాక్టీస్‌కు  అనుమతి ఇవ్వడం వల్ల భారత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది. భారత్ లోని లాయర్లు, విదేశీ లాయర్లకు ఇది ఉభయతారకంగా ఉంటుందని, ఆ దిశగానే బీసీఐ నియమనిబంధనలు ఉంటాయని తెలిపింది. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంపై వ్యక్తమయ్యే ఆందోళనల పరిష్కరానికి, ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ హబ్‌గా భారత్ ను తీర్దిదిద్దేందుకు వీలుగా బీసీఐ నిబంధనలు ఉంటాయని వివరించింది. న్యాయవాద వృత్తిలో మరింత అభివృద్ధి చోటుచేసుకుంటుందని పేర్కొంది.

బీసీఐ నిబంధనల ప్రకారం బీసీఐ రిజిస్ట్రేషన్ లేకుండా విదేశీ లాయర్ల కానీ, న్యాయ సంస్థలు కానీ లా ప్రాక్టీస్ చేయకూడదు. విదేశీ న్యాయవాది రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000, న్యాయ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50,000గా ఉంటుంది.  రిజస్టేషన్ కోసం తిగిన డాక్యుమెంట్లను కూడా అప్లికేషన్‌తో పాటు చేర్చవలసి ఉంటుంది. లా ప్రాక్టీస్‌ కోసం ఆయా దేశాల్లో ప్రాథమిక అర్హత ఏదైతే ఉంటుందో ఇండియాలో ప్రాక్టీసుకు కూడా ఇదే ప్రాథమిక అర్హతగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐదేళ్ల వరకూ అది చెల్లుబాటు అవుతుంది.

వాలిడిటీ తేదీ ముగియడానికి 6 నెలల ముందు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ దరఖాస్తును సరైన కారణం ఉంటేనే తోసిపుచ్చుతుంది. కౌన్సిల్‌దే తుది నిర్ణయంగా ఉంటుంది. జాతీయ భద్రత కారణాల దృష్ట్యా కానీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కానీ, ఇతర విలువైన కారణాల రీత్యా కానీ రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్‌ను రద్దుకు సిఫారసు చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

నిబంధనల ప్రకారం, నాన్-నొగేషియల్ మేటర్ల విషయంలోనే విదేశీ లాయర్లు, సంస్థలు లా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర నాయశాఖతో సంప్రదింపుల అనంతరమే ఏయే రంగాల్లో ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలనే దానిపై బీసీఐ నిబంధనలు రూపొందించడం ఉంటుంది. విదేశీ లాయర్లు, సంస్థలను ఏ కోర్టుల ముందు కానీ, ట్రిబ్యునల్స్ ముందు కానీ, చట్టబద్ధ లేదా రెగ్యులేటరీ అథారిటీల ముందు హాజరయ్యేందుకు అనుమతించరు. లావాదేవీల పనులు లేదా కార్పొరేట్ వర్క్‌‌‌ల విషయంలో ప్రాక్టీసుకు వారిని అనుమతిస్తారు.

కన్వేయన్సింగ్ ఆఫ్ ప్రాపర్టీ, టైటిల్ ఇన్వెస్టిగేషన్, ఇందుకు సంబంధించిన పనులలో వారి ప్రమేయాన్ని అనుమతించరు. దేశ చట్టాలకు లోబడి ట్రాన్సాక్ట్ బిజినెస్, అడ్వైజ్, ఒపీనియన్లు ఇవ్వవచ్చు. ఇండియాలో రిజిస్టర్ అయిన న్యాయవాదుల హక్కులకు భంగం కలిగించరాదు.

రిజిస్టర్ అయిన న్యాయ సంస్థలు, న్యాయవాదులు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇండియాలోని ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనైనా రిజిస్ట్రర్ అయిన అడ్వకేట్ల న్యాయసలహాలు తీసుకోవచ్చు. ఇండియాలో రిజిస్ట్రర్ అయిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ ఫారెన్ లాయర్లు, సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉండవచ్చు.

అలాగే, తప్పుడు ఆధారాలు చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తేలిన విదేశీ లాయర్లు, న్యాయ సంస్థలపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జరిమానాలు, రిజిస్ట్రేషన్ రద్దు చేయడం చేస్తారు.