బండి సంజయ్ మాటలను వక్రీకరించి ప్రచారం

బండి సంజయ్ మాటలను వక్రీకరించి ప్రచారం
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచితంగా వాఖ్యలు చేసారంటూ ఆ పార్టీ శ్రేణులు ఢిల్లీ నుండి గల్లీ వరకు ఆందోళనలు చేస్తుండటం పట్ల బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
బండి మాట‌ల‌ను వ‌క్రీక‌రించి ప్ర‌చారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.  దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్ అయిన ఒకటేనని స్పష్టం చేశారు.  లిక్కర్ స్కామ్ లో కవిత నిజాలు చెప్పాలని ఆయన  డిమాండ్  చేశారు.
 
కాగా, సంజ‌య్ పై ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో బిఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదుల చేయగా, కొన్నిచోట్ల ఎఫ్ఐఆర్ లు కూడా న‌మోద‌య్యాయి. పలుచోట్ల సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. తెలంగాణ మ‌హిళ క‌మిష‌న్ సంజ‌య్ వ్యాఖ్యాల‌ను సుమోటోగా తీసుకుని సంజాయిషీ ఇవ్వ‌వ‌ల‌సిందిగా ఆదేశించింది. విచారణ జరిపామని డిజిపిని ఆదేశించింది. ఢిల్లీలోని జాతీయ మ‌హిళ కమీషన్ లో సైతం బిఆర్ ఎస్ నేత‌లు ఫిర్యాదు చేశారు.

మేయర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాగా, రాజ్ భవన్  ముందు ఉద్రిక్త నెలకొనడంతో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బండి సంజయ్ పై ఫిర్యాదు చేసేందుకు మేయర్, ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే గొంగిడి సునీత  ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, పలువురు మహిళా నేతలు రాజ్ భవన్ కు వచ్చారు.
 
అయితే గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో మేయర్, మహిళా కార్పొరేటర్లు రాజ్ భవన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. వినతి పత్రాలను  రాజ్ భవన్ గోడకు అంటించారు. బీజేపీకి,  గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.