ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడుల పట్ల ఆవేదన

ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై ఇటీవల జరుగుతున్న దాడులు భారతీయులకు ఆవేదన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దాడుల వార్తలు దేశ ప్రజల మనుసును కలిచి వేస్తున్నాయని వాపోయారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీ్‌సతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఆసీ్‌సలోని హిందూ దేవాలయాలపై దాడుల అంశంలో భారతీయుల ఆవేదనను అల్బనీస్‌ దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియాలో భారతీయుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నానని అల్బనీస్‌ తనకు భరోసా ఇచ్చారని మోదీ చెప్పారు.  అయితే దేవాలయలపై దాడుల అంశాన్ని విలేకరుల సమావేశంలో అల్బనీస్‌ ప్రస్తావించలేదు.
కానీ, ఢిల్లీ, కాన్‌బెర్రా మధ్య బంధం బహుముఖమైనదని, ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం ఈ ఏడాదిలో కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.  మూడు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో అల్బనీస్‌ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఖనిజ సంపద, వలసలు, విద్య, క్రీడలు తదితర అంశాలపై చర్చించారు.
 
 క్రీడలు, ఆవిష్కరణలు, ఆడియో-వీడియో పరికరాల తయారీ, సౌర విద్యుత్‌కు సంబంధించి ఇరువర్గాల మధ్య 4ఒప్పందాలు కుదిరాయి. కాగా, భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత కీలకమైందని మోదీ అభిప్రాయపడ్డారు.
 
ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ లో తీరప్రాంత భద్రత, రక్షణ అంశంలో పరస్పర సహకారం పెంపుపై చర్చించామన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా తన బలగాలను మొహరిస్తున్న తరుణంలో భారత్‌, ఆసీస్‌ ప్రధానుల మధ్య చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. మేలో ఆస్ట్రేలియాలో జరిగే క్వాడ్‌ సదస్సులో మోదీకి ఆతిథ్యమివ్వడంతోపాటు జీ-20సదస్సుకు భారత్‌ వచ్చేం దుకు ఎదురుచూస్తున్నానని అల్బనీస్‌ పేర్కొన్నారు.