భారత్ లో హెచ్3ఎన్2 వైరస్‌తో మొదటగా రెండు మరణాలు

భార‌త్ లో కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా మరిచిపోకముందే మరో కొత్త వైర‌స్ వ‌చ్చింది. హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ.. బారిన పడుతోన్న వారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. సాధారణ జ్వరం, జలుబుగా మొదలైన ఈ వ్యాధి మనిషి ప్రాణాలను బలితీసుకునే స్థాయికి చేరుకుంది.

దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో మరో వ్యక్తి కూడా ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. కర్నాటకలోని హసన్‌కు చెందిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ప్రకారం మార్చి 1న హిరే గౌడ వైరస్ వల్ల చనిపోయాడు. ఆయన డయాబెటిక్, హైపర్‌టెన్షన్‌తో కూడా బాధపడ్డాడు.

ఈ వైరస్ కారణంగా ఇన్ ఫ్లూయెంజా బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ వ్యాధి బాధితులు 90 మందికి పైనే ఉన్నారని అధికారవర్గాల సమాచారం.  అదేవిధంగా ఎనిమిది మంది హెచ్1ఎన్1 వైరస్ బారినపడ్డారని వెల్లడించాయి.  ఫ్లూ బాధితుల సంఖ్య ఇటీవల పెరుగుతోందని, అందులో చాలా వరకు హంకాంగ్ ఫ్లూ గా పిలిచే హెచ్3ఎన్2 బాధితులేనని వైద్యులు తెలిపారు.

ఈ వ్యాధి సంక్రమణ 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు వారిలోనూ, 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజెన్స్‌లో కూడా కనబడుతోంది. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా దీని బారిన పడే అవకాశం ఉంది.  ఈ కొత్త వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

వీటికి అదనంగా వాంతి వచ్చినట్లుగా అనిపించడం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. మిగతా అనారోగ్యాల బారిన పడ్డ వారిలోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చని, అయితే వారం పైగా ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందేనని చెప్పారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.