ఏపీ ప్రభుత్వం నోటితో ఇచ్చిన హామీలు.. రాతల్లో లేవు!

క్యాబినెట్‌ సబ్‌ కమిటీతో జరిగిన సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన రాతపూర్వక మినిట్స్‌లో ఉద్యోగులు ప్రస్తావించిన ముఖ్యమైన అంశాల ప్రస్తావన లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు నోటి మాటగానే నెలాఖరు కల్లా డబ్బులు చెల్లిస్తామని చెప్పడంపై అభ్యంతరం చెబుతున్నారు.

ఉద్యోగుల జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఈహెచ్‌ఎస్‌ పథకాల్లో ఉద్యోగులు దాచుకున్న డబ్బులు రూ.3000 కోట్లు నెలాఖరులోగా చెల్లిస్తామని,  చట్టబద్ధంగా రావాల్సిన డీఏ బకాయిలు, ఆర్జిత సెలవులు సుమారు రూ.2000 కోట్లను సెప్టెంబరులోపు రెండు విడతలుగా చెల్లిస్తామని హామీలు ఇచ్చారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన మినిట్స్‌లో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఏ విషయాలపైనా స్పష్టత ఇవ్వలేదు. కేవలం ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు సంబంధించి రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. రుణాలు ఇవ్వటం సాధారణ విధి. ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం చూపే ప్రయత్నం చేయడం పట్ల ఉద్యోగులు విస్మయం చెందుతున్నారు.

దానితో డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని ఏపీజేఏసీ అమరావతి నాయకులు ప్రకటించారు. స్వల్ప మార్పులు మినహా ఉద్యమ కార్యాచరణ అమలుకే ఏపీ ఐకాస అమరావతి మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. ఏపీ జేఏసీ అమరావతి మొదటి డిమాండ్‌గా పీఆర్సీ, పేస్కేల్స్‌ గురించి చెప్పమని అడిగితే మినిట్స్‌లో ఆ విషయాలేమీ తెలపలేదని విమర్శించారు.

ఉద్యోగులకు రావాల్సిన డీఏలపైనా స్పష్టత లేదని, జీతాలనే ప్రతి నెలా ఒకటిన ఇవ్వలేకపోతున్నారని, సీపీఎస్‌ రద్దుపై హామీనిచ్చి అమలుచేయలేదని, పాత పింఛను విధానం తప్ప దేన్నీ అంగీకరించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగు సేవల ఉద్యోగుల జీతభత్యాల పెంపునూ పక్కన పెట్టేశారని బొప్పరాజు ఆరోపించారు. ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నందున ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు.

సమస్యల పరిష‌్కారంలో ప్రభుత్వంపై నమ్మకం లేదని, జేఏసీ నాయకులు ప్రకటించారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఉద్యమాన్ని కొనసాగించాల్సిందేనని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు డిమాండ్‌ చేశారు.  ఈ నెల 9 నుంచి ఏప్రిల్‌ 5వరకు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన తెలుపుతారు. గతంలో ప్రకటించిన జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్లు, డివిజన్‌ కేంద్రాల్లోని ఆర్డీవో/సబ్‌కలెక్టర్‌ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు ఉండవని తెలిపారు.

మార్చి 17, 20 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగ సంఘాల నాయకులు సందర్శిస్తారు. మార్చి 21నుంచి ఏప్రిల్‌5 వరకు ‘వర్క్‌టురూల్‌’ అమలు చేస్తారు. ఈ సమయంలో ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధుల నిర్వర్తిస్తారు. ఏప్రిల్‌ 5న తిరిగి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ఈనెల 16న మళ్లీ ఈహెచ్‌ఎస్‌, పీఆర్సీ బకాయిలపై సీఎస్‌తో చర్చించేందుకు ప్రయత్నిస్తారు. ప్రభుత్వం దిగిరాకపోతే రెండో విడత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.