కాలం చెల్లిన మరో 65 చట్టాలు రద్దు

కాలం చెల్లిన మరో 65 చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ఈ నెల 13 నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. సోమవారం గోవాలో 23వ కామన్వెల్త్ లా సదస్సులో మంత్రి మాట్లాడుతూ దేశంలోని వివిధ కోర్టుల్లో 4.98 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

టెక్నాలజీని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెబుతూ పేపర్‌లెస్ జ్యుడీషియరీ’ ప్రభుత్వ అంతిమ లక్షమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతిపౌరుడు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

సంక్షేమ రాజ్యంగా ప్రతివ్యక్తి సమస్యలను తాము వినగలుగుతుండడం ముఖ్యమని మంత్రి చెప్పారు. అనేక చర్యలు తీసుకోవడంలో ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను సృష్టించడంలో మోదీ ప్రభుత్వం ముందువరసలో ఉందని రిజిజు చెప్పారు. చట్టాలు కాలం చెల్లిపోయి, వాటిని అమలు చేయడం ప్రజల జీవితాలకు అడ్డుగా తయారైనప్పుడు వాటిని రద్దు చేసి తీరాలని ఆయన స్పష్టం చేశారు.

గత ఎనిమిదిన్నరేళ్లలో తాము అలాంటి 1,486 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని చెప్పారు. ఈనెల 13న తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో కాలం చెల్లిన మరో 65 చట్టాలను రద్దు చేయడానికి తాను ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు రిజిజు చెప్పారు. కేసులు పేరుకుపోవడాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటోందని పేర్కొన్నారు.

దేశంలోని వివిధ కోర్టుల్లో 4కోట్ల 98 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించడం అంత సులభం కాదు. ఎందుంటే పరిష్కరించే కేసులకన్నా కొత్త కేసులు రెట్టింపు ఉంటున్నాయి. అయితే, భారతీయ న్యాయమూర్తులు అసాధారణంగా పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కొనియాడారు.

కానీ రానురాను ఇది పెద్ద సవాలుగా మారుతోందని, అందుకే ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తోందని తెలిపారు. ఇ కోర్టులను, స్షెల్ ప్రాజెక్ట్సు మూడో దశను ప్రారంభించామని, త్వరలోనే మధ్యవర్తిత్వ బిల్లును ప్రవేశపెట్టనున్నామని ఆయన చెప్పారు. గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్ల్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 52 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.