నీటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి

కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం పాటియాలాలో నీట్స్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు.

మెడికల్ సైన్సెస్‌కు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్ష కేంద్రాన్ని ఈ విధంగా ఓ కేంద్ర మంత్రి స్వయంగా సందర్శించడం ఇదే మొదటిసారి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే విషయాన్ని మంత్రి మాండవీయ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అక్కడి ఏర్పాట్లపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దేశ వ్యాప్తంగా 277 నగరాల్లో 902 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎస్‌బీ కోర్సులకు నిర్వహించే ఈ పరీక్షను మొత్తం 2,08,898 మంది రాస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

అహ్మదాబాద్‌లోని కమాండ్ సెంటర్ సెటప్ నుంచి నీట్ పరీక్షా  నిర్వహణను  నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్   ప్రెసిడెంట్ డాక్టర్. అభిజత్ షేత్ పరిశీలించారు. 90 మంది సభ్యులతో కూడిన బృందం వివిధ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది.

జీరోటాలరెన్స్ పాలసీలో భాగంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీలతో గట్టి నిఘా , డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడంతోపాటు మొబైల్ ఫోన్ జామర్లను కూడా వినియోగించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 10 మంది సభ్యులతో  టిసిఎస్  ముంబైలో ఒక నిఘా కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

ఎన్‌బిఇఎంఎస్ ద్వారకా ఆఫీస్‌లో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి పరీక్షను పరిశీలించారు. దేశం లోని వివిధ పరీక్ష కేంద్రాల నుంచి కూడా ఈ కమాండ్ సెంటర్ లైవ్ దృశ్యాలను పరిశీలిస్తుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లో భాగంగా పోలీస్ చెక్‌పోస్ట్, మెడికల్ అసిస్టెన్స్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.