సూపర్‌సోనిక్ మిసైల్ బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం

సూపర్‌సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత నౌకాదళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘సీకర్‌ అండ్‌ బూస్టర్‌’లను ఉపయోగించి అరేబియా సముద్రంలోని కోల్‌కతా క్లాస్ గైడెడ్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా క్షిపణిని పరీక్షించినట్టు నేవీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
 
‘‘స్వదేశీ పరిజ్ఞానంతో నౌక నుంచి ప్రయోగించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్‌ క్షిపణిని భారత నావికా దళం పరీక్షించింది.. ఇందులోని సీకర్‌ బూస్టర్‌లను డీఆర్‌డీవో రూపొందించింది.. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ పట్ల మా నిబద్ధతను ఇది బలపరుస్తోంది’’ ఇండియన్‌ నేవీ ట్విటర్‌లో పేర్కొంది.  భారత్‌- రష్యాలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను రూపొందించాయి.
జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఈ క్షిపణి ధ్వని వేగానికి మూడురెట్ల వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉంది.  గతేడాది ఏప్రిల్‌లో భారత్‌ నేవీ, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌తో కలిసి యాంటి షిప్‌ వెర్షన్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిస్‌ క్షిపణలను పరీక్షించింది. మరోవైపు, బ్రహ్మోస్‌ క్షిపణులను ఇతర దేశాలకు సైతం భారత్ ఎగుమతి చేస్తోంది. ఈ క్షిపణుల మూడు బ్యాటరీలను సరఫరా చేసేందుకు గతేడాది జనవరిలో ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
 
సముద్ర తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేధించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. బంగాళాఖాతంలోని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపై లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత వైమానిక దళం గతేడాది డిసెంబర్‌లో బంగాళాఖాతంలో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది 400 కి.మీ దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించింది. ఈ క్షిపణిని సుఖోయ్ సు-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించినట్లు వైమానిక దళం తన అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్ష సందర్భంగా క్షిపణి లక్షిత నౌకను మధ్యలో ఢీకొట్టిందని రక్షణ శాఖ తెలిపింది.