కృత్రిమ మేధ సంక్లిష్ట పనులను కూడా చేస్తుంది

కృత్రిమ మేధ(ఏఐ) ఆటోమేట్‌గా పనిచేయడమేకాక సంక్లిష్ట పనులను కూడా చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ), 5జి అనేక రంగాలలో మార్పు తేలిందని చెప్పారు. ‘సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ జీవించడం లో సౌలభ్యాన్నిసాధించుకోవడం’ అనే అంశం పై జరిగిన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 

భారత్ లో పెద్ద ఎత్తున డిజిటల్ మౌలిక వసతులు సృష్టించామని, అది దేశంలోని ప్రతి మూల డిజిటల్ విప్లవం తేడానికి తోడ్పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దం లోని భారతదేశం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ తన పౌరులకు అదే పనిగా సాధికారిత ను సమకూర్చుతోందని తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలు గా ప్రతి ఒక్క బడ్జెటు సాంకేతిక విజ్ఞానం సహాయంతో ప్రజల జీవన సౌలభ్యం సాధనపై శ్రద్ధ తీసుకొంటోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంవత్సరం బడ్జెటులో, సాంకేతిక విజ్ఞానానికి, మానవ ప్రమేయానికి ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక విజ్ఞానం ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలను అందిస్తుందని తెలిపారు.  

వైద్యం, విద్య, వ్యవసాయం, తదితర రంగాల్లో కృత్రిమ మేధ, 5జి మొబైల్ సేవలు పెనుమార్పులు తేగలదని ప్రధాని స్పష్టం చేశారు. సామాన్యున్ని బాధిస్తున్న 10 సమస్యలను గుర్తించాలని ఆయన స్టేక్‌హోల్డర్లను కోరారు. కృత్రిమ మేధ ఆ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. సాంకేతికత సాయంతో 2047 నాటికి భారత్ ఓ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంప్లియన్స్ కాస్ట్‌లు తగ్గించడం ద్వారా చిరు వ్యాపారాలకు తోడ్పాడాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.  ‘పన్ను వ్యవస్థను ఫేస్‌లెస్ చేయడానికి, పన్ను చెల్లించేవారి సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించాము’ అని గుర్తు చేశారు. పౌరుల జీవితాల్లో గుణాత్మక వ్యత్యాసాన్ని తేడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

భారత దేశం ఆధునిక డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సృష్టిస్తోందని, డిజిటల్ విప్లవం ప్రయోజనాలు అందరికీ చేరేలా చూస్తోందని మోదీ పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన, ఆధార్, మొబైల్ నంబర్ కలగలిపిన ‘జెఎఎం ట్రినిటీ’ అన్నది ‘ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు’ ఏర్పాటుకు వీలుకల్పించిందని తెలిపారు.  పేదలకు ప్రయోజనాలు చేకూర్చిందని చెప్పారు. 21వ శతాబ్దాన్ని సాంకేతికతతో నడిపిస్తున్నామని, దీనిని కేవలం డిజిటల్, ఇంటర్నెట్ టెక్నాలజీకే పరిమితం చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు.