14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు `గల్ఫ్’  షాక్ తప్పదా?  

మంద భీంరెడ్డి,
గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలకు గల్ఫ్ గుబులు పట్టుకున్నది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కు ఇది సంకటంగా మారింది. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నా ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీకి గుదిబండగా మారనున్నది.
 
మరోవైపు గల్ఫ్ కార్మికుల సమస్యలను లేవనెత్తడంలో ప్రతిపక్షాలు వెనుకబడ్డాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని చిన్నా చితకా పార్టీలు గల్ఫ్ కార్మికుల తరఫున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఇప్పుడు ఎవరివైపు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 
 
కవిత ఓటమికి కారణమిదేనా?
 
గల్ఫ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే 2019 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ఓడిపోయారనే ప్రచారం జరిగింది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లోక్ సభ సిట్టింగ్ స్థానాలను 2019 లో టీఆర్ఎస్ కోల్పోయింది.  అంతర్గత విశ్లేషణ చేసుకోవాల్సిన ఆ పార్టీ తన వైఖరిని ఇప్పటికీ సరిదిద్దుకోవడం లేదు.
ఈ చివరి బడ్జెట్ లోనూ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు చేయలేదు. ఎన్నారై సెల్ ను సచివాలయంలో భాగంగా పెట్టడంతో బాధిత కుటుంబాలకూ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయింది.   అంతేకాకుండా గత ఎనిమిదిన్నరేళ్లలో 1,700 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్ లో చనిపోయిన రైతులకు ఆర్ధిక సాయం చేసిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర గల్ఫ్ మృతులకు మొండిచేయి చూపుతున్నారనే విమర్శలున్నాయి. దీని ప్రభావం రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై పడే అవకాశమున్నది. గల్ఫ్ కార్మిక కుటుంబాల ప్రభావం ఏయే సెగ్మెంట్ల పై ఉంటుందో ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆరా తీసి, వివరాలను అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 
 
నెరవేరని హామీలు
 
గల్ఫ్ సంక్షేమ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు సాయం, గల్ఫ్ కార్మికులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెన్షన్ వంటివి అపరిష్కృతంగానే ఉండిపోయాయి.
 
 ఇప్పటికీ గల్ఫ్ దేశాల్లో అనేక ఇబ్బందుల నడుమ బతుకుతూ ఎంతో కొంత డబ్బుల్ని ఇంటికి పంపుతున్న కార్మికులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మృతదేహాన్ని స్వస్థలాలకు తరలించడమూ సమస్యాత్మకంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ‘చొరవ తీసుకుని డెడ్ బాడీని తెప్పించాం’ అని చెప్పుకోవడమూ వినిపిస్తుంటుంది. 
 
ప్రధాన పార్టీలకు పరేషానే
 
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికార బిఆర్ఎస్ విఫలమైతే, వాటిని లేవనెత్తడంలో కాంగ్రెస్, బీజేపీ వెనుకబడ్డాయి.  రాహుల్ గాంధీ సందేశంతో ఇటీవల టీపీసీసీ విడుదల చేసిన నాలుగు పేజీల చార్జిషీట్ లోనూ గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదు. మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లకు ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గండం పొంచి ఉన్నది.
 
అయితే మూడు చిన్న పార్టీలు బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, వైఎస్సార్ టిపి లు గల్ఫ్ సమస్యలను బలంగా లేవనెత్తుతూ ముందుకు వెళుతున్నాయి. ఆ చిన్న పార్టీలు ఏం చేయగలుగుతాయనేది ఎలా ఉన్నా కనీసం వారి గురించి ఆలోచించే స్పృహతో ఉన్నాయన్న సంతృప్తి వ్యక్తమవుతున్నది.    
 
గల్ఫ్ ఉద్యమం.. రాజకీయ అడుగులు
 
గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ లలో ప్రస్తుతం 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు బతుకుతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో సుమారు 30 లక్షల మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చేశారు. కుటుంబ సభ్యులతో కలుపుకుంటే వీరి ఓటు బ్యాంకు కోటి వరకు ఉంటుందని అంచనా.
 
అయితే ఈ ఓటు బ్యాంకు సమీకృతమవుతుండడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త కోణం. అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోక పోవడంతో స్వయంగా ఉద్యమించాలని గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. పసుపు బోర్డు ఉద్యమం తరహాలో గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ సాధన కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎత్తుగడగా ఉపయోగించుకోవాలని పావులు కదుపుతున్నాయి. 
 
పోటీకి ఎన్నారైల సై!
 
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గల్ఫ్ ఎన్నారైలు హక్కుల సాధన ఉద్యమంలోనూ ముందున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి. చిన్న పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రవాసుల రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి పావులు కదుపుతున్నట్లు సమాచారం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ (ధన ప్రభావం లేని రాజకీయం) నినాదంతో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు. 
 
రాష్ట్ర ఖజానాకు రూ.15 వేల కోట్లు!
 
గల్ఫ్ దేశాల్లో సుమారు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రూ.10 వేల చొప్పున నెలకు రూ.1,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.18 వేల కోట్లు, ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.1.53 లక్షల కోట్లు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోకి చేరాయి. ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరినా.. ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.15,300 కోట్ల ఆదాయం సమకూరినట్లే. 
 
బడ్జెట్ లో లేని కేటాయింపులు
 
భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నాయి. ఇటీవలి నివేదికలు దీన్నే స్పష్టం చేశాయి. ఐటీ ‘ఫారెక్స్’ రూపంలో దేశ ఆర్ధిక వ్యవస్థలోకి గల్ఫ్ కార్మికులు, ఇతర దేశాల్లోని ఎన్నారైలు పంపిస్తున్న డబ్బులు భారత ఆర్ధిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాయి. కానీ ప్రవాసులు పంపే సొమ్ముపై ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల కనిపించడం లేదు. ప్రవాసీ కార్మికుల బతుకులు మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయడం లేదు.   
 
దేశాభివృద్ధికి వారు ఆర్థిక జవాన్లు
 
ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు తాము సంపాదించిన సొమ్మును విదేశీ మారకద్రవ్యం రూపంలో స్వదేశానికి పంపిస్తున్నారు. దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థల బలోపేతంలో భాగస్వాము లవుతున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల తరహాలోనే వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు.
 
కానీ ప్రభుత్వాల నుంచి మాత్రం సానుభూతిని, గౌరవాన్ని, హక్కులను పొందలేకపోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించే హామీలు, ప్రసంగాల్లో వినిపించే మాటలు చేతల్లో కనిపించడం లేదు. అందుకే రానున్న ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు, ముఖ్యంగా అధికార పార్టీకి ఓటు రూపంలో వారు జవాబు చెప్పాలనుకుంటున్నారు.   
 
ప్రభావితం చేయగల సెగ్మెంట్లు
 
నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్.