అమరరాజా కాలుష్యంపై ప్రజాభిప్రాయ సేకరణ.. సుప్రీం ఆదేశం 

అమరరాజా బ్యాటరీస్‌ కాలుష్య వ్యవహారంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి)కి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎపిపిసిబికి షోకాజ్‌ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది.

సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వు కొనసాగుతుందని తెలిపింది. అమర రాజా బ్యాటరీస్‌ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, దీనివల్ల పరిసర ప్రాంతాల జలాల్లో సీసం ధాతువు (లెడ్‌ కంటెంట్‌)లు పెరుగుతున్నందున సంస్థను మూసివేయాలని ఎపి కాలుష్య నియంత్రణ మండలి గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

సదరు నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ బ్యాటరీస్‌ సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అజరు రాస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

అమరరాజా తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో ఇప్పటివరకు 34 సార్లు నోటీసులు ఇచ్చి తమను వేధిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్ట ప్రకారం ముందుకు పోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షోకాజ్‌ నోటీసులపై చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, చర్యలు తీసుకోవాలని పిసిబికి ఆదేశించింది. నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత జారీ చేసే ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలుపుదల చేయాలని తెలిపింది.

ఆ నాలుగు వారాల్లో అవసరమైతే న్యాయ పరిష్కారాల కోసం కోర్టును ఆశ్రయించవచ్చని అమరరాజా కంపెనీకి ధర్మాసనం సూచించింది. పిసిబి ఆదేశాలపై అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాలని అమరరాజా బ్యాటరీస్‌కు సూచించింది.