మేఘాలయలో ప్రధాని మోదీ సభకు అనుమతి నిరాకరణ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల బహిరంగసభ జరిపేందుకు మేఘాలయలోని స్టేడియంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి నిరాకరించారు. ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీని ఈ నెల 24న నిర్వహించేందుకు బీజేపీకి మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది.

ఫిబ్రవరి 24వతేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. స్టేడియంలో ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడం సరికాదని మేఘాలయ క్రీడా విభాగం పేర్కొంది,స్టేడియంలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున సైట్‌లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని జవాబిచ్చారు.

అందువల్ల ప్రత్యామ్నాయ వేదిక అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియంలో సభ అనుమతి విషయమై పరిశీలిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే తెలిపారు. రూ.127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని ఎలా ప్రకటించగలరని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మేఘాలయలో మోదీ హవా చూసి అక్కడి ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలు అవాక్కయ్యాయని సిన్హా ఆరోపించారు.

‘‘కాన్రాడ్ సంగ్మా,ముకుల్ సంగ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారా? వారు మేఘాలయలో బీజేపీ వేవ్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధానమంత్రి ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు’’ అని ఆమె స్పష్టం చేశారు.  కాగా, 60 స్థానాలతో కూడిన మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరనగున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెల్లడిస్తారు.