గవర్నర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో కౌశిక్‌రెడ్డి

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న కమీషన్ ఆయనకు ఆదివారం నోటీసులు జారీ చేసింది.  ఈ నెల 21న ఉదయం 11:30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కమిషన్ ముందు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

తెలంగాణలో బిఆర్‌ఎస్ సర్కార్‌కు, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. గవర్నర్ మీద ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు.

రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ గురించి.. ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య మరోసారి పొరపొచ్చాలు రావటంతో తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పందించిన కౌశిక్ రెడ్ అటు బీజేపీ నాయకులపై మండిపడుతూనే ఇటు గవర్నర్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.గ వర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నిలదీశారు. 

అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన్ బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ ఎందుకు క్లియర్ చేయడం లేదంటూ ప్రశ్నించే క్రమంలో కౌశిక్ రెడ్డి అనుచిత పదజాలాన్ని వినియోగించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిజెపి శ్రేణులు కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కౌశిక్‌రెడ్ది దిషిబొమ్మను కూడా దహనం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కూడా కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిపై బీజేపీ నేతలు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరైందికాదని, వెంటనే రాష్ట్ర గవర్నర్‌కు కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అలాగే కౌశిక్ రెడ్డిపై గత నెల 28న బిసి పొలిటికల్ జెఎసి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను బర్తరఫ్ చేయాలని బిసి పొలిటికల్ జెఎసి నేతలు కోరారు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా డిజిపికి అదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.

గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి రాజ్యాంగ పదవిని అగౌరవ పరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 14 తేదీనే కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది.