మధ్యప్రదేశ్‌కు చేరుకున్న మరో 12 చీతాలు

దేశంలో అంతరించి పోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమం కింద దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు శనివారం మధ్యప్రదేశ్‌కు చేరుకున్నా యి. గత ఏడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు చేరుకున్న విష యం తెలిసిందే. ఇప్పుడు మరో ఆఫ్రికా దేశమైన దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలు భారత్‌కు చేరుకున్నారు.

12 చీతాలతో దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్ నుంచి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన వాయుసేనకు చెందిన విమానం శనివారం ఉదయం గ్వాలియర్‌లోని ఎయిర్‌బేస్‌కు చేరుకుంది.అక్కడినుంచి ఈ చీతాలను హెలికాప్టర్‌లలో కూ నో నేషనల్ పార్కుకు తరలించారు. గత ఏడాది నంబియా నుండి వచ్చిన చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈ పార్క్ లోనే వదిలారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌లు ఈ చీతాలను పార్కులోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేశారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వాటిని 30 రోజలు పాటు క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం పెద్ద ఎన్‌క్లోజర్లలోకి పంపిస్తామని చీతా ప్రాజెక్టు చీఫ్ ఎస్‌పి యాదవ్ తెలిపారు.

దక్షిణాఫ్రికానుంచి భారత్‌కు చేరుకున్న 12 చీతాల్లో ఏడు మగ చీతాలు కాగా, అయిదు ఆడ చీతాలున్నాయి. వీటితో కలిపి కూనో పార్కులో చీతాల సంఖ్య 20కి చేరుకుంది. వీటిలో 10 మగ, మరో 10 ఆడచీతాలున్నాయి. దేశంలో 71 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరిస్తుంది. ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి విడతలవారీగా దిగుమతి చేసుకుంది.

ప్రపంచంలో చీతాలు ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉండగా, వీటిలో అత్యధికం నమీబియాలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం భారత్‌కు చేరుకున్న చీతాలను దక్షిణాఫ్రికా విరాళంగా ఇచ్చింది. అయితే వీటిని పట్టుకోవడానికి మన దేశం ఒక్కో చీతాకు 3 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఓ వన్యప్రాణి నిపుణుడు చెప్పారు.

ఈ పార్క్ లో చీతాలు తిరగడానికి గల అవకాశాలను, పరిసరాలను గత ఏడాది సెప్టెంబర్ లో దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించి, కొన్ని సూచనలు కూడా చేసింది. గత ఏడాది ఆగష్టు లోనే ఇవి రావలసి ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఈ విషయమై ఒప్పందం పూర్తి కావడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తున్నది.