పాక్‌కు రహస్య సమాచారం చేరవేస్తూ పట్టుబడిన జవాన్‌

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఆర్మీ జవాన్‌ను పట్టుకున్నారు. విచారణ కోసం ఆర్మీ కోర్టుకు అతడ్ని అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్మేషన్‌ ప్రాంతంలో సిగ్నల్‌మెన్‌గా అలీమ్ ఖాన్ విధులు నిర్వహిస్తున్నాడు.
 
అయితే పాకిస్థాన్‌కు గూఢచారిగా అతడు పనిచేస్తున్నాడు. చైనా సరిహద్దులో ఇండియన్‌ ఆర్మీ కార్యకలాపాల సమాచారాన్ని రహస్యంగా ఆ దేశానికి చేరవేస్తున్నాడు. ఢిల్లీలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పాకిస్థాన్‌ గూఢచారి అబిద్ హుస్సేన్ అలియాస్ నాయక్ అబిద్‌కు కీలక సమాచారాన్ని అందజేస్తున్నాడు.

చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్‌ అలీమ్ ఖాన్, ఫార్మేషన్‌ నిర్మాణం, కార్యకలాపాలు, గార్డు డ్యూటీల జాబితా, ఆర్మీ వాహనాల సమాచారం, వాటి కదలికల గురించిన వివరాలు పాకిస్థాన్‌కు చేరవేశాడు. అలాగే చైనా సరిహద్దును పర్యవేక్షిస్తున్న ఉపగ్రహాలు, నిఘా రాడార్, ఇతర పరికరాల స్థానాల సమాచారాన్ని కూడా పొందేందుకు ప్రయత్నించాడు.

మరోవైపు నిఘా వర్గాల ద్వారా ఈ విషయం తెలియడంతో జవాన్‌ అలీమ్ ఖాన్‌ను ఆర్మీ అరెస్ట్‌ చేసింది. పాకిస్థాన్‌కు చేరవేసిన సమాచారంపై అతడ్ని ప్రశ్నించి విచారణ జరిపేందుకు కోర్ట్‌మార్షల్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

ఈశాన్య ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఆ సరిహద్దులోని ఆర్మీ కార్యకలాపాల గురించి శత్రు దేశమైన పాకిస్థాన్‌కు చేరవేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.