భారత్‌లో రెండు ట్విట్ట‌ర్ ఆఫీసులు మూసివేత

ట్విట్టర్‌లో వ్యయాలు తగ్గించుకోవాలన్న ఎలాన్ మస్క్ అభిమతానికి అనుగుణంగా భారత్‌లో ట్విట్టర్‌కున్న రెండు కార్యాలయాలు మూతపడ్డాయి. న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసివేయగా.. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతోంది. ట్విట్టర్ గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా సుమారు 90 శాతమని ఓ అంచనా.

ఇక బెంగళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యాలయం కూడా భవిష్యత్తులో కొనసాగుతుందో లేదో అన్నదానిపై పూర్తి సమాచారం లేదని ట్విట్టర్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ మార్కెట్‌కు ఎలన్‌మస్క్‌ అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదని ఆయన తీసుకునే నిర్ణయాలే స్పష్టం చేస్తున్నాయి.

ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నాక మస్క్.. సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. 2023 కల్లా సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలన్‌మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత శానిఫ్రాన్సిస్కో, లండన్‌ కార్యాలయాలకు కూడా అద్దె చెల్లించుకోలేక అవస్థలు పడుతున్నారు. మస్క్‌ తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తే.. ట్విట్టర్‌ దివాళా తీసేందుకు దగ్గరగా ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఉద్యోగులను తొలగించడంతో పాటూ కార్యాలయాలను మూసివేస్తున్నారు.  ఇక భారత్‌లో ట్విట్టర్.. ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు, రాజకీయ చర్చలకు కీలక వేదికగా మారింది. ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఏకంగా 86.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.  కాగా, భారత్ లో ట్విట్ట‌ర్ వినియోగ‌దారులు ఎక్కువ‌గానే ఉన్నా  ఆదాయం మాత్రం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు రిపోర్ట్‌లో తేలింది.

దీంతో భారత్ ఉన్న రెండు ఆఫీసుల్ని మూసివేసేందుకు మ‌స్క్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే కంపెనీని ఆర్ధికంగా బ‌లోపేతం చేయ‌డానికి ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని ఇటీవ‌ల మ‌స్క్ వెల్ల‌డించారు.