విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించండి కేసీఆర్

తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. అన్ని అనుమతులున్న ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన కోరుతూ ఆయనకు ఓ లేఖ వ్రాసేరు. గతంలో విమానయాన శాఖ మంత్రి, తాను లేఖ రాసినా..రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్రమంత్రి గుర్తుచేశారు.

కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకాన్ని తీసుకొచ్చిందని, దానికి అనుగుణంగా తెలంగాణలోనూ అన్ని రకాల అనుమతులు ఉన్న మూడు విమానాశ్రయాల (ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్) నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

విమానాశ్రయాల నిర్మాణం తదతర అంశాలకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ పలుమార్లు లేఖలు రాసినా, అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసినా స్పందన రాలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి లేఖకు కొనసాగింపుగా, ఈ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ తాను స్వయంగా ముఖ్యమంత్రికి 2022, జూలై 30న లేఖ రాశానని గుర్తు చేశారు.

దీనికి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్ పల్లి, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), దేవకరద్ర (మహబూబ్ నగర్), మమ్నూరు (వరంగల్), బసంత్ నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు పంపిందని.. అయితే ఏఏఐ చేపట్టిన ఓఎల్ఎస్ సర్వే, సాయిల్ టెస్టింగ్ (భూపరీక్ష), టెక్నో-ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందని కిషన్ రెడ్డి లేఖలో గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాలు అభివృద్ధి చేసి ఇమ్మని అడిగితే ఎటువంటి స్పందన రాకపోగా, ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఏం చేస్తోందంటూ ప్రశ్నలు అడగటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి విమర్శించారు. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 140 దాటడం, 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.

విమానయాన రంగంలో ఉన్నటువంటి ఈ సానుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగ పరచుకుని.. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విమానాశ్రయాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు.