వందే భారత్ రైళ్లపై దాడులపై హెచ్చరిక

దేశంలోనే అత్యధిక వేగంతో, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లపై పలుచోట్ల జరుగుతున్న దాడుల పట్ల దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులైన రైళ్లపై దాడులు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇకపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
 
రైళ్లపై దాడులు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించవద్దని వేడుకుంటున్నట్లు తెలిపింది. ఎవరైనా రైళ్లపై దాడులు చేసినా లేదా ఆస్తులకు నష్టం కలిగించినా వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది  తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పలుమార్లు వందే భారత్ రైలుపై దాడులు జరిగాయి.
 
ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల రాళ్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అద్దాలను అధికారులు మార్చాల్సి వచ్చింది. ఖమ్మం, విశాఖ ఘటనలలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు.
 
 దీంతో ఎవరైనా అలా చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇది తెలిసి కూడా చాలామంది ఆగంతకులు రైళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య గత నెల సంక్రాంతి రోజున వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందిస్తోంది.
 
ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళుతుండగా ఖమ్మం సమీపంలోకి రాగానే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సీ-12 కోచ్‌లోని ఎమర్జెన్సీ గ్లాస్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విశాఖకు ట్రైన్ చేరుకున్న తర్వాత గ్లాస్‌ను మార్చారు
రాళ్ల దాడి ఘటనలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడిచింది.
 
కోచ్‌కు అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే గతంలో విశాఖపట్నం సమీపంలోని కంచరపాలెంలో గేటు వద్ద కొంతమంది రాళ్లు రువ్వడంతో రెండు కోచ్‌లలోని అద్దాలు ధ్వంసమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరిగాయి.