ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్ మృతుని శవపేటిక

దుబాయి నుంచి వచ్చిన మృతుని శవపేటికను మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇంటి ముందు ఉంచి గల్ఫ్ కార్మికులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తో సహా మరికొందరు కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన వలస కార్మికుడు లంక దాసరి వెంకటేష్  అనారోగ్యంతో ఇటీవల దుబాయిలో మృతిచెందాడు. దుబాయిలోని సామాజిక సేవకుడు గుండెల్లి నర్సింలు చొరవతో  వెంకటేష్ శవపేటిక మంగళవారం హైదరాబాద్ కు చేరుకున్నది. 
 
హైదరాబాద్ నుండి మృతుని స్వగ్రామం గంభీర్ పూర్ కు అంబులెన్సులో శవపేటికను తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటి ముందు శవపేటికను అంబులెన్స్ నుంచి కిందికి దింపి గల్ఫ్ కార్మికులు నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పినాడని విమర్శించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని ఎగవేశాడని ధ్వజమెత్తారు.
 
 అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి పూర్తి బాధ్యత వహించాలని చెబుతూ అందుకే ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్ అమరునికి శాంతియుతంగా నివాళులు అర్పించామని చెప్పారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరాడటంలో ప్రతిపక్షాలు విఫలమైనాయని పేర్కొంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇంటి ముందు కూడా అదేవిధంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
 
ఉత్తర తెలంగాణలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికులు,  గ్రామాలలోని వారి కుటుంబ సభ్యులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ గల్ఫ్ రిటనీ కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రవిగౌడ్ తెలిపారు.