తండాల అభివ్రుద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తాం

బీజేపీ అధికారంలోకి వస్తే తండాల సమగ్రాభివ్రుద్ధి కోసం ప్రత్యేకంగా డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీనిచ్చారు. సేవాలాల్ నడయాడిన బంజారా హిల్స్ లో సేవాలాల్ మందిరాన్ని నిర్మించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివ్రుద్ధి చేస్తామని పేర్కొన్నారు.
 
 సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొంటూ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో ప్రత్యేకతను చాటుకునే బంజారా జాతికి సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని చెప్పారు. అటు బ్రిటీష్ పాలకులు, ఇటు ముస్లిం పాలకుల మత ప్రచారంతో అనేక ఇబ్బందులు పడ్డ బంజారా సమాజాన్ని తన ధర్మ ప్రచార బోధనలతో సన్మార్గంలో నడిపించిన మహానుభావుడు సేవాలాల్ అని కొనియాడారు.
 
 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ నయా పైసా నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ఉపాధి లేక పనుల కోసం పట్టణాలకు వలస వెళుతున్నారని చెప్పారు.  ఇంటర్, డిగ్రీ చదివిని లంబాడ యువకులు ఉద్యోగాల్లేక, సొంతంగా వ్యాపారం చేసుకునే స్తోమత లేక ఆటోలను అద్దెకు తీసుకుని బతుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఎనిమిది మంది గిరిజనులకు స్థానం కల్పించారని, ఓ ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేశారని గుర్తు చేస్తూ తెలంగాణాలో కేసీఆర్ మాత్రం గిరిజనులను మోసం చేస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి ఏళ్ల తరబడి అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.