తుర్కియే, సిరియాలోని భూకంప బాధితుల కోసం `ఆపరేషన్ దోస్త్’ 

భూకంప బాధిత తుర్కియే, సిరియాకు మానవత దృక్పథంతో వైద్య సహాయాన్ని పంపడంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించింది. తుర్కియే, సిరియాకు అత్యవసర వైద్య సహాయ సామగ్రి పంపడం ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేస్తున్న ప్రయత్నాల గురించి ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా ఒక ట్వీట్‌ చేశారు.
 
 “భారతదేశం, తన ప్రాచీన వారసత్వమైన వసుధైక కుటుంకం స్ఫూర్తితో ఆ రెండు దేశాలకు సాయం అందిస్తోంది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6న, రెండు శక్తిమంతమైన భూకంపాలు తుర్కియే, సిరియాలో విలయం సృష్టించిన రోజున, ప్రాణాలను రక్షించే అత్యవసర ఔషధాలు, రక్షణ పరికరాలతో కూడిన 3 ట్రక్కుల సహాయ సామగ్రిని హిండన్ ఎయిర్‌బేస్‌ నుంచి 12 గంటల లోపు ఏర్పాటు చేయడం జరిగింది.
 
ఫిబ్రవరి 7న ఉదయం 10:00 గంటలకు ట్రక్కులు ప్రారంభమయ్యాయి. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) ఆ సహాయ సామాగ్రిని అందజేయడం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. సహాయ సామగ్రితో కూడిన చివరి ట్రక్‌ రాత్రి 9:30 గంటలకు చేరుకుంది, అదే రోజు రాత్రి 10 గంటలకు విమానం అత్యవసర సహాయ సామగ్రితో సిరియాకు బయలుదేరింది.
 
ఆ సామగ్రిలో 5,945 టన్నుల అత్యవసర సహాయ పరికరాలు ఉన్నాయి. వాటిలో, ప్రాణాలను రక్షించే 27 రకాల మందులు, రెండు రకాల రక్షణ పరికరాలు, మూడు రకాల కీలక వైద్య పరికరాలు ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ. 2 కోట్లు.  ఫిబ్రవరి 10న, తుర్కియే, సిరియా రెండింటికీ పెద్ద మొత్తంలో సహాయ సామగ్రిని అందజేయడం జరిగింది.
 
సిరియాకు పంపిన సాయంలో 72 అత్యవసర ఔషధాలు, వినియోగ వస్తువులు, 7.3 టన్నుల రక్షణ పరికరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.1.4 కోట్లు. తుర్కియేకు పంపిన సాయంలో 14 రకాల వైద్య, అత్యవసర పరికరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 4 కోట్లు.