కేసీఆర్ డిప్రెషన్లో ఉంటే వెంటిలేటర్పై కాంగ్రెస్

తెలంగాణాలో కేసీఆర్ డిప్రెషన్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్పై ఉందంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేసారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కలలు కనేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ, అవినీతి, రైతు, నిరుద్యోగ వ్యతిరేక పాలనని విమర్శించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేయబోతోందని , ప్రధాని మోదీ నేతృత్వంలో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందని , దోచుకోవటమే పరమావధిగా కేసీఆర్ కుటుంబపాలన ఉందని ధ్వజమెత్తారు.

తెలంగాణ అవినీతి ఢిల్లీ, పంజాబ్ లను కూడా తాకింది అంటూ విమర్శించారు. అసెంబ్లీలో ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై తరుణ్ చుక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో లేని మోదీ గురించి కేసీఆర్ మాట్లాడటం సిగ్గు చేటు అంటూ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నిస్తుంటే కేసీఆర్ మాత్రం అధికారం పోతుందని పూర్తిగా అర్థమై డిప్రెషన్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

 తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని తరుణ్ చుగ్ చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో త్వరలోనే వీధి కార్నర్ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలో ప్రజాగోస బీజేపీ భరోసా నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 11వేల సభలు నిర్వహించనున్నట్లు చుగ్ చెప్పారు.

ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100కు తగ్గకుండా సభలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ సభలకు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. చివరగా హైదరాబాద్ లో ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తరుణ్ చుగ్ చెప్పారు.