11 శాతం పెరిగిన వాణిజ్య వాహనాల అమ్మకాలు

దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాలు 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 9-11 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. మీడియం, హెవీ కమర్షల్‌ వాహనాల అమ్మకాల్లో ఇది ఉంటుందని తెలిపింది. భారత్‌ జీడీపీ వృద్ధిరేటు 6 శాతం ఉంటుందని పేర్కొంది.

కేంద్ర బడ్జెట్లో మౌలికసదుపాలకు కేటాయింపులు భారీగా పెంచినందున వాణిజ్య వాహనాల అమ్మకాల్లో పెరుగుదల ఉంటుందని తెలిపింది. దేశంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు వరసగా మూడో సంవత్సరం పెరుగుదల నమోదు చేసినట్లు క్రిసిల్‌ పేర్కొంది. తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు 8-10 శాతం వరకు పెరుగుతాయని క్రిసిల్‌ అంచనా వేసింది.

భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 13-15 శాతం వరకు ఉండొచ్చని తెలిపింది. డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ 2025 నాటికి కొవిడ్‌ ముందునాటి అమ్మకాలకు చేరుకోవచ్చన క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అంజూ సేథీ తెలిపారు. దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాలు 2021-22 సంవత్సరంలో 31 శాతం పెరిగాయి. ఆ ఆర్ధిక సంవత్సరం అమ్మకాలు 27 శాతం వరకు ఉంటాయని అంచనా.

 రియల్‌ ఎస్టేట్‌, రోడ్ల నిర్మాణం, మైనింగ్‌ వంటి రంగాల కార్యకలాపాలు భారీగా పెరిగినందున వాణిజ్య వాహనాల అమ్మకాలు పెరుగుతాయని తెలిపింది. ఒరిజినల్‌ ఎక్వూప్‌మెంట్‌ తయారీదారులు(ఓఈఎం) బీఎస్‌ 6స్టేజ్‌ 2 ఉద్గారాల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నందున కంపెనీల లాభదాయకత కూడా పెరుగుతుందని తెలిపింది.

ముఖ్యంగా స్టీల్‌ ధరలు తక్కువగా ఉన్నందున ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 5-6 శాతం లాభాలు ఆర్జించనున్నాయని, వచ్చే ఆర్ధిక సంవత్సరి ఇది 7-7.5 శాతం వరకు ఉంటుందని తెలిపింది.