బీజేపీ వచ్చాకనే త్రిపురలో అభివృద్ధి

దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాలనలో త్రిపుర ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, బీజేపీ వచ్చాకనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. త్రిపురలో హింసకు తావులేకుండా చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.

త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారంనాడు అంబస్సాలో‌ మోదీ తొలి ర్యాలీలో ప్రసంగిస్తూ భయాలు, హింస నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశామని తెలిపారు. త్రిపురను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే దక్కుతుందని చెప్పారు. కాంగ్రెస్- వామపక్షాల కూటమికి వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని తిరోగమనంవైపు మళ్ళిస్తుందని ప్రధాని హెచ్చరించారు.

త్రిపురలో గతంలో పోలీసు స్టేషన్లన్నీ సీపీఎం అధీనంలో ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టబద్ధపాలన అమల్లోకి వచ్చిందని మోదీ అంబస్సా ర్యాలీలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించామని, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని వివరించారు.

గ్రామాలను కలుపుతూ 5000 కిలోమీటర్ల మేర రోడ్లు వచ్చాయని, ఆప్టికల్ భైబర్, 4జి కనెక్టివిటీ గ్రామాలకు చేర్చామని చెప్పారు. బీజేపీ పాలనలో అంతర్జాతీయ స్థాయికి త్రిపుర చేరుకుంటోందని భరోసా ఇచ్చారు. నౌకాశ్రయాలతో ఈశాన్య, త్రిపురలను అనుసంధానిస్తూ వాటర్‌వేస్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని గుర్తు చేశారు.

ప్రజల ఆదాయం పెంపుదల పట్ల బీజేపీ ప్రభుత్వం దృష్టి సారిస్తున్నదని చెబుతూ పీఎం కిసాన్ పథకం క్రింద రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ జరుగుతున్నదని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో తిరిగి ఏర్పడిన తర్వాత ఈ మొత్తాన్ని పెంచగలమని చెప్పారు. రైతులు కనీస మద్దతు ధర ప్రయోజనాలు పొందుతున్నారని ప్రధాని గుర్తు చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, బీజేపీ తెచ్చిన విజన్ డాక్యుమెంట్ కేవలం పేపర్ కాదని, ప్రజల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఒకప్పుడు త్రిపురలో దిగ్బాంధాలు, తిరుగుబాట్లు మాత్రమే కనిపించేవని, ఇప్పుడు శాంతి, అభ్యుదయం, అభివృద్ధికి చిరునామాగా దూసుకువెళ్తోందని చెప్పారు.

రాష్ట్రంలో 13 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇచ్చామని, 107 కోట్ల మందికి సెటిల్‌మెంట్ కల్పించామని తెలిపారు.  త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను 55 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తక్కిన 5 సీట్లు తమ భాగస్వామ్య పక్షమైన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)కి కేటాయించింది.

కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 60 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.