16వేలకు పైగా పెరిగిన టర్కీ, సిరియా మృతుల సంఖ్య!

టర్కీ, సిరియాలలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 16,000కుపైగా పెరిగింది. కాగా భూకంపం నుంచి బతికి బట్టకట్టినవారిని ఇప్పుడు అక్కడ తీవ్ర చలి బాధిస్తోంది. ఇప్పటికీ శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉండడాన్ని రెస్యూ సిబ్బంది కనుగొన్నారు. రిక్టరు స్కేలుపై 7.8గా నమోదయిన భూకంపం సంభవించి ఇప్పటికే 72 గంటలు గడిచిపోయాయి. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడాల్సిన స్థితి నెలకొని ఉంది. మరోవైపు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

భూకంపం నుంచి బతికిబయటపడ్డ వారు ఇప్పుడు తిండి, ఆశ్రయం కోసం వెంపర్లాడుతున్నారు. నిస్సహాయంగా తమ బంధువులను సాయం కోరుతున్నారు. చాలా మంది శిథిలాల కింద ఇప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రెస్కూవర్లు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరణాల సంఖ్య ఇప్పటికీ పెరుగుతోంది.

ఓ వైపు రెస్కూ ఆపరేషన్ మందకొడిగా సాగుతుండడం, మరోవైపు చలి తీవ్రత మైనస్ 23 డిగ్రీల ఫారెన్‌హీట్‌గా ఉండడం…అక్కడి విషాధాన్ని మాటల్లో విశదీకరించడం సాధ్యం కావడం లేదు. వేలాది మంది కారుల్లో, టెంట్లలో రాత్రిపూట గడుపుతున్నారు. ఇప్పటికే 12,873 మంది టర్కీలో, 3,162 మంది సిరియాలో చనిపోయారని అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ సాయం సేకరించేందుకు యూరొప్ యూనియన్ బ్రస్సెల్స్‌లో డోనర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసింది. ‘మేము సాయం కోసం పరుగులు పెడుతున్నాం’ అని యూరొప్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ట్వీట్ చేశారు. ఐక్యరాజ్య సమితి అధికారులు కూడా సహాయ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.

ప్రపంచంలోని 24 దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుర్కియేలో భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. అమెరికా, చైనా, గల్ఫ్ దేశాలు కూడా సాయపడుతున్నాయి.

ఈ భూకంపానికి దాదాపు 7 ప్రావిన్స్‌లలో 3 వేల భవనాలు కుప్పకూలిపోయాయి. వీటిల్లో ఆసుపత్రులు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మసీదులు ఉన్నాయి. టర్కీలో కహ్రమన్మరాస్‌, గాజియాంటెప్‌ నగరాలు భూకంపానికి అత్యంత ప్రభావితమైన నగరాలుగా ఉన్నాయి. ఇక ఈ భూకంపానికి 23 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశమున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపింది. ఈ నేపథ్యంలో భూకంప ప్రభావిత ప్రాంతాలకు 13 అంతర్జాతీయ అత్యవసర బృందాలను పంతున్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.

1999లో వచ్చిన 7.4 మాగ్నిట్యూడ్ భూకంపంలో 17000 మంది చనిపోయారన్నది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. రెండు దేశాల్లో గడ్డకట్టే వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌ ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు.