మ‌హారాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొర‌ట్ రాజీనామా

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొర‌ట్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేత‌గా వైదొల‌గుతున్న‌ట్టు థొర‌ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు మంగ‌ళ‌వారం లేఖ రాశారు.  పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం ఆయన లేఖ రాసినట్లు వెలుగులోకి వచ్చింది.

బాలాసాహెబ్ థోరట్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. దీంతోపాటు ఖర్గేకు సోమవారం రాసిన లేఖను కూడా జత చేశారు. తనను పటోలే ఏ విధంగా అవమానించారో ఈ లేఖలో పేర్కొన్నారు.

తన కుటుంబ సభ్యులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సత్యజీత్ టంబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఉద్దేశపూర్వకంగానే మితిమీరి మాట్లాడారని ఆరోపించారు. ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించిన సత్యజీత్ టంబేకు థోరట్ మేనమామ. అయితే టంబే తండ్రి సుధీర్‌ను కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలో నిలిపింది.

సత్యజీత్ టంబే గెలిచిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ముందుగానే కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి తెలియజేశానని, అయినప్పటికీ తనకు తప్పుడు ఫారాలను ఇచ్చారని ఆరోపించారు. తన మేనమామ థోరట్‌కు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు, తమ కుటుంబాన్ని కాంగ్రెస్‌కు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.