ఎస్‌బీఐకు రికార్డు స్థాయిలో రూ 14,205 కోట్లు నికర లాభం

దేశంలో అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ మూడో త్రైమాసిక ఆర్ధిక ఫలితాల్లో రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. ఒక త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా క్యూ3లో 68.5 శాతం నికర లాభాన్ని ప్రకటించింది. వార్షిక ప్రతిపాదికన బ్యాంక్‌ అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో  రూ. 14,205 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
 
గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ. 8,432 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.13,265 కోట్లుగా ఉంది. త్రైమాసికంతో పోల్చితే క్యూ3లో లాభం 7 శాతం పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు బ్యాంక్‌ నికర లాభం రూ. 25,219 కోట్లుగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఇది 36.16 శాతం అధికం.
 
వడ్డీ ఆదాయం రూ. 38,069 కోట్లుగా ఉంది. వడ్డీ మార్జిన్‌ 29 బేసిస్‌ పాయింట్స్‌ నుంచి 3.69 శాతానికి పెరిగింది.  బ్యాంక్‌ రుణాలు 17.60 శాతం పెరిగి రూ. 31.33 లక్షల కోట్లుగా ఉన్నాయి. దేశీయంగా అడ్వాన్స్‌లు 16.91 శాతం పెరిగి రూ. 20.49 లక్షల కోట్లుగా ఉన్నాయి. దేశీయంగా అడ్వాన్స్‌లు ప్రధానంగా రిటైల్‌ పర్సనల్‌ లోన్ల పెరుగుదల మూలంగా నమోదైందినట్లు ఎస్‌బీఐ తెలిపింది.
 
పర్సనల్‌ లోన్లు రూ. 11.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రతిపాదికన ఇవి 18.10 శాతం పెరిగాయి. బ్యాంక్‌ డిపాజిట్లు వార్షిక ప్రతిపాదికన 9.5 శాతం, త్రైమాసికంతో పోల్చితే 0.56 శాతం పెరిగాయి. బ్యాంక్‌ డిపాజిట్లు రూ. 42.13 లక్షల కోట్లుగా ఉన్నాయని బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ నికర నిర్ధరక ఆస్తులు 57 బేసిస్‌ పాయింట్లు తగ్గి 0.77 శాతంగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర ఎన్‌పీఏలు రూ. 23,484 కోట్లుగా ఉన్నాయి. అదానీ సమస్యపై పరోక్షంగా స్పందించిన బ్యాంక్‌ ఇది బ్యాంక్‌ ఆస్తులపైకాని, లాభంపై కాని పెద్దగా ప్రభావం చూపబోదని ఎస్‌బీఐ తెలిపింది.